కరోనాపై కర్ణాటక సర్కార్ చేతులెత్తేసిందా.. దుమారం రేపుతున్న మంత్రి శ్రీరాములు కామెంట్స్...
కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. 'ఇక ఆ భగవంతుడే మనల్ని కరోనా నుంచి కాపాడాలి.' అని శ్రీరాములు వ్యాఖ్యానించడంతో... ప్రభుత్వం చేతులెత్తేసిందా అన్న చర్చ మొదలైంది. యడియూరప్ప పాలన ఎంత అద్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే శ్రీరాములు మాత్రం మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని వివరణ ఇచ్చుకున్నారు.

శ్రీరాములు ఏమన్నారు...
'ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మనమంతా అప్రమత్తంగా వ్యవహరించాలి. మీరు అధికారి పార్టీనా... ప్రతిపక్షమా... లేక సంపన్నులా.. నిరుపేదలా... కరోనాకు ఇవేవీ అవసరం లేదు. అది ఎవరి పట్లా వివక్ష చూపించదు.మరో 2 నెలల్లో కేసులు 100శాతం పెరుగుతాయని కచ్చితంగా చెప్పగలను. కొంతమంది దీన్ని ప్రభుత్వ బాధ్యతారాహిత్యం లేదా నిర్లక్ష్యం అనవచ్చు. కానీ అవన్నీ సత్య దూరమే. కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని కరోనా నుంచి కాపాడగలడు' అని శ్రీరాములు పేర్కొన్నారు.

ఫైర్ అయిన కాంగ్రెస్...
భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడు అన్న శ్రీరాములు కామెంట్స్ కర్ణాటకలో కలకలం రేపాయి. దీనిపై కాంగ్రెస్ నేత డీకె శివ కుమార్ ట్విట్టర్లో స్పందించారు. 'యడియూరప్ప ప్రభుత్వం కరోనాను ఎలా హ్యాండిల్ చేస్తుందో చెప్పేందుకు శ్రీరాములు చేసిన కామెంట్సే నిదర్శనం. ఒక మహమ్మారి నుంచి ప్రజలను కాపాడలేని ప్రభుత్వం మనకు అవసరమా..? ప్రజల జీవితాలను భగవంతుని దయకు వదిలేయడమంటే ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టుకోవడమే.' అని వ్యాఖ్యానించారు.

శ్రీరాములు వివరణ...
తన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో శ్రీరాములు వివరణ ఇవ్వక తప్పలేదు. 'కరోనా నుంచి బయటపడాలంటే ప్రజల భాగస్యామ్యంతో పాటు దేవుడు కూడా మనల్ని రక్షించాలని చెప్పాను. కానీ కొంతమంది రిపోర్టర్స్ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. కరోనా నియంత్రణ విషయంలో శ్రీరాములు చేతులెత్తేశారు అని ప్రచారం చేశారు.నేను చెప్పిందేమంటే... కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ.. మనందరినీ ఆ దేవుడు మాత్రమే కాపాడగలడని చెప్పాను. దాన్ని వక్రీకరించకూడదు.' అని చెప్పుకొచ్చారు.

బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్..
ప్రస్తుతం కర్ణాటక 47,253 కరోనా పాజిటివ్ కేసులతో దేశంలో నాలుగో స్థానంలో ఉంది.గడిచిన 24గంటల్లో కొత్తగా 3176 కరోనా కేసులు నమోదవగా... 86 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 928 మంది మృతి చెందారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో మంగళవారం (జూలై 14) నుంచి మరోసారి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ వారాంతం నుంచి రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది.ఇప్పటికే లక్ష టెస్టు కిట్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని జిల్లా అధికారులకు పంపిణీ చేసింది.












Click it and Unblock the Notifications