ప్రతిపక్షాలకు షాక్, అవినీతి సీఎంకు రెడ్ కార్పెట్ వేస్తారా ?, గో బ్యాక్ సీఎం బ్యానర్లు !
బెంగళూరు/పాట్నా: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో రెండు రోజుల పాటు ఎన్ డీఏ వ్యతిరక పార్టీలు ( విపక్షాలు) సమావేశం జరుగుతుండగా 24 పార్టీలకు చెందిన అగ్ర నేతలు పాల్గొన్నారు. రెండో రోజు సభకు హాజరయ్యేందుకు పలువురు నేతలు మంగళవారం బెంగళూరు వస్తున్నారు. బెంగళూరు నగరంలోని ప్రధాన రహదారులపై బీహార్ సీఎం నితీశ్కుమార్కు వ్యతిరేకంగా బ్యానర్లు ఏర్పాటు చెయ్యడం కలకలం రేపింది. గో బ్యాక్ సీఎం అంటూ బ్యానర్లు వేశారు.
బెంగళూరు నగరంలోని ప్రధాన వీధుల్లో ఖాళీగా ఉన్న ప్రధాని పదవికి అభ్యర్థి ఎవరనే అర్థం వచ్చే బ్యానర్లను రాత్రికి రాత్రే ఏర్పాటు చేసి వారి పార్టీల గురించి ప్రచారం చెయ్యడానికి ప్రయత్నించారు. బెంగళూరు నగరంలో ఇలాంటి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని అవహేళన చేస్తూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ అవినీతిపరుడిగా అభివర్ణిస్తూ కొన్ని బ్యానర్లు దర్శనం ఇస్తున్నాయి.

దీనితో పాటు బీహార్లో గత ఏడాదిలో రెండుసార్లు కూలిపోయిన సుల్తాన్గంజ్ వంతెన కూలిన చిత్రంతో పాటు ఆ వంతెన ఎప్పుడు కూలిపోయింది అనే తేదీని కూడా బ్యానర్ లో వేశారు. అవినీతి పరుడైన బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నారని ఎద్దేవ చేశారు. గో బ్యాక్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ అని బ్యానర్లు వేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై సెటైర్లు వేసి బ్యానర్లు ఏర్పాటు చేశారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో ఈరోజు ప్రతిపక్ష పార్టీల సమావేశం కూడా జరగనుంది. ఎన్ డీఏని వ్యతిరేకిస్తున్న 24 పార్టీల అగ్ర నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఎలాగైనా ఇంటికి పంపించాని ప్రతిపక్షాలు జపం చేస్తున్నాయి.

2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. సీట్ల కేటాయింపు అంశాలు, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇదే సమావేశంలో చర్చించనున్నారు. జూన్ నెలాఖరున బీహార్ రాజధాని పాట్నాలో తొలి విపక్ష సమావేశాలు జరిగాయి. అప్పుడు ఈ సమావేశంలో 16 పార్టీలు పాల్గొన్నాయి. ఈసారి 8 కొత్త పార్టీలు మద్దతు తెలపగా 24 పార్టీలు పాల్గొంటున్నాయి.
ఈసారి సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద బెంగళూరులో బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు కలకలం రేపడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ బ్యానర్లు తొలగిస్తున్నది. విపక్ష పార్టీల సమావేశంలో 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం విశేషం.
విపక్ష పార్టీల సమావేశం అనంతరం బీజేపీ కూడా తమ ప్రభావం చూపిస్తున్నది. ఎన్ డీఏకి మద్దతు తెలిపేందుకు అనేక పార్టీలు ముందుకు రావడంతో మంగళవారం న్యూఢిల్లీలో ఎన్డీయే మద్దతు పార్టీల సమావేశం జరగనుంది. తమకు 38 పార్టీల మద్దతు ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్ డీఏ మద్దతు పార్టీల సమావేశంలో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications