రాజ్యసభలో గందరగోళం... ట్రిపుల్ తలాక్ బిల్లుకు బ్రేక్
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భార్యకు ట్రిపుల్ తలాక్ చెబితే దాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. అయితే విపక్ష పార్టీల సభ్యులు బిల్లును అడ్డుకున్నారు. బిల్లును సెలెక్ట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. దీనిపై సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మెన్ జనవరి 2కు సభను వాయిదా వేశారు. ఇదిలా ఉంటే రాజ్యసభలో ఈ బిల్లు పాస్ చేసేందుకు ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఇందుకు కారణం రాజ్యసభలో ప్రభుత్వానికి సభ్యుల మద్దతు తక్కువగా ఉండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
ముస్లిం సామాజిక వర్గంలో తలాక్ చెప్పి భార్యకు భర్త విడాకులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు సంచలన తీర్పును గతేడాది ఇచ్చింది. ఇక అప్పటి నుంచి దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత లోక్సభలో బిల్లును ఆమోదం పొందేలా చూసింది. ఇక రాజ్యసభలో బిల్లును పాస్ చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.
ఇప్పటికే ప్రభుత్వానికి సంఖ్యాబలం తక్కువగా ఉండటం, దీనికి తోడు ఇతర పార్టీల నుంచి మద్దతు లభించకపోవడంతో బిల్లు మరోసారి చర్చనీయాంశమైంది. బిల్లును మరోసారి పరిశీలించాలని ఇందుకు సెలెక్ట్ కమిటీ వేయాలని సభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం ఇందుకు తిరస్కరించింది. ఇదిలా ఉంటే రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ వేయాలని తృణమూల్ కాంగ్రెస్ కూడా పట్టుబట్టింది.
అంతకుముందు పార్టమెంటు హాలులో కలిసిన విపక్ష పార్టీల సభ్యులు సెలెక్ట్ కమిటీ వేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. ఇక బిల్లు విషయానికొస్తే తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్లు జైలు శిక్ష వేయడం సరికాదని విపక్షాలు చెబుతున్నాయి. ఇతర మతాల్లో విడాకులు చెబితే ఇలాంటి శిక్ష లేదని వారు వాదిస్తున్నారు. అంతేకాదు ఒకవేళ భర్త జైలుకు వెళితే భార్యా పిల్లలకు మెయింటెనెన్స్ ఎవరిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విపక్షాలు ఎన్ని చెప్పినప్పటికీ ప్రభుత్వం మాత్రం బిల్లుపై ముందుకు వెళ్లాలనే నిర్ణయించింది.