అయోధ్య నుంచి అసద్ ప్రచారం : ర్యాలీ-స్వామీజీల నిరసన : వంద స్థానాల్లో ఎంఐఎం పోటీ..!!
ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరి కొద్ది రోజుల్లో ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్రం-రాష్ట్రంలో ఉన్న బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇదే సమయం లో పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీని దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇక, యూపిలో అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసిన తరువాత బీజేపీ తమకు ఎన్నికల్లో ఈ అంశం కలిసి వస్తుందని లెక్కలు వేస్తోంది. ఇక, ఇతర పార్టీలు సైతం అదే అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారంతో బీజేపీ వ్యూహాన్ని దెబ్బ తీయాలని భావిస్తున్నాయి.
అయోధ్య నుంచి అసద్ ఎన్నికల ర్యాలీ
అందులో భాగంగా..ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం అయోధ్య జిల్లా నుంచి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్య జిల్లా నుంచి మంగళవారం వంచిత్-షోషిత్ సమాజ్ సమావేశంలో ప్రసంగించటం ద్వారా ప్రచారాన్ని ప్రారంభిస్తారని యూపీ ఎంఐఎం రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు షౌకత్ అలీ చెప్పారు. అయోధ్య నగరానికి 57 కిలోమీటర్ల దూరంలోని రుదౌలి తహసీల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల ప్రచార సభలో ఒవైసీ ప్రసంగిస్తారని అలీ పేర్కొన్నారు.
హిందూ స్వామీజీల అభ్యంతరం..
అయోధ్య జిల్లాను ఫైజాబాద్ అని సోషల్ మీడియాలో ఎఐఎం పోస్టర్లలో పేర్కొంది. హిందూ సమాజాం మనో భావాలను ఒవైసీ దెబ్బతీస్తున్నందున ఎంఐఎం ర్యాలీని నిషేధించాలని బీజేపీ కోరుతోంది. ఫైజాబాద్ జిల్లా పేరును 2018 నవంబర్లో అయోధ్యగా మార్చారు.ఒవైసీ అయోధ్య సందర్శించడానికి అనుమతించమని హనుమాన్ గార్హి ఆలయ పూజారి మహంత్ రాజు దాస్ చెప్పారు. ఒవైసీ పాల్గొనే సమావేశానికి ముస్లింలతో పాటు, దళితులు, వెనుకబడిన,అగ్రవర్ణ హిందువులను కూడా ఆహ్వానించినట్లు యూపీ ఎంఐఎం నేత అలీ చెప్పారు.
వంద స్థానాల్లో పోటీకి ఎంఐఎం ప్రణాళికలు
యూపీ ఎన్నికల్లో గెలిస్తే అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎంఐఎం పనిచేస్తుందని అలీ అన్నారు.ఉత్తర ప్రదేశ్లోని 100 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని ఎంఐఎం ప్రకటించింది. అయోధ్య నగరానికి 57 కిలో మీటర్ల దూరంలో ఈ ర్యాలీ జరగనుంది. అదే విధంగా రేపు 8వ తేదీ, 9వ తేదీల్లో సుల్తాన్ పూర్, బారాబంకీ ప్రాంతాల్లో జరిగే సభల్లోనూ అసద్ పాల్గొంటారు. ఉత్తర ప్రదేశ్ లో మూడు రోజుల పర్యటన ఆరంభమే అని.. త్వరలో అనేక ప్రాంతాల్లో ప్రజలతో మమేకం అవుతామని అసద్ వెల్లడించారు.
Recommended Video
యోగీ ప్రభుత్వాన్ని ఓడించటమే లక్ష్యమంటూ
తమ పార్టీ కేడర్ ను బలోపేతం చేసుకోవటంతో పాటుగా యోగి ప్రభుత్వాన్ని ఓడించటమే తమ లక్ష్యంగా అసద్ చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికల వేడి ఎంఐఎం అధినేత ర్యాలీ ద్వారా ప్రారంభం కానుంది . దీనిని బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది. ఇదే సమయంలో బీఎస్పీ సైతం అయోధ్య నుంచే తమ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ప్రకటించింది.