P-Marq exit poll: ఎన్డీఏదే అధికారమన్న పీ మార్క్, గట్టిపోటీనిచ్చిన కాంగ్రెస్ కూటమి
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. పీ-మార్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ తాజాగా విడుదలయ్యాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారం దక్కించుకునే అవకాశాలున్నాయని ఈ సర్వే తేల్చింది. అయితే, ఇండియా కూటమి గట్టిపోటీనిస్తుందని పేర్కొంది.
పీ-మార్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 288 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార కూటమికి 137 నుంచి 157 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక్కడ మెజారిటీ మార్క్ 145 ఉంది.

ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) 126, 146 స్థానాల మధ్య గెలుస్తుందని అంచనా వేయగా.. చిన్న పార్టీలు, స్వతంత్రులు 2 నుంచి 8 స్థానాలను దక్కించుకుంటారని తెలిపింది. మహాయుతికి 42 శాతం ఓట్లు రావచ్చని, ఎంవీఏకు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇతరులకు 17 శాతం లభిస్తుందని అంచనా వేసింది.
మహాయుతి కూటమిలో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేయగా, 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది శివసేన(ఏక్నాథ్ షిండే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(అజిత్ పవార్) 59 స్థానాల్లో పోటీ చేసింది. మరోవైపు, MVA కూటమిలో కాంగ్రెస్ నుంచి 101 మంది అభ్యర్థులు, శివసేన (ఉద్ధవ్ థాక్రే) నుంచి 95 మంది, NCP (శరద్ పవార్) నుంచి 86 మంది అభ్యర్థులను నిలబెట్టాయి.
కాగా, నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రచార పోరు సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి ప్రధాన రాజకీయ ప్రముఖులు రాష్ట్రవ్యాప్తంగా తమ తమ పార్టీల తరపున ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications