బుద్ధి పోనిచ్చుకోని పాకిస్తాన్
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బరితెగిస్తోంది. తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. నిన్నటి వరకూ జమ్మూ కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ (LoC) పొడవునా కాల్పులకు తెగబడుతూ వస్తోంది పాకిస్తాన్ సైన్యం. భారత ఆర్మీ పోస్టులపై తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపింది.

శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లల్లో ఎల్ఓసి వెంబడి ఎలాంటి కవ్వింపు లేకుండా చిన్న ఆయుధాలతో పాక్ సైనికులు కాల్పులు జరిపారు. భారత జవాన్లు దీన్ని తిప్పి కొట్టారు.
పహల్గామ్ ఉగ్రదాడి చోటు చేసుకున్నప్పటి నుంచీ ఇదే తంతు. ఎల్ఓసీ వద్ద కాల్పులు జరపడం ఇది పదోసారి. కిందటి నెల 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి సంభవించిన మరుసటి రోజు నుంచే నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ వచ్చింది. ఈ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్కు ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ భారత్ ఆరోఫించిన నేపథ్యంలో ఈ కాల్పులు మొదలయ్యాయి.
భారత్తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత సైన్యం సహనానికీ పరీక్షలు పెడుతోంది. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా హఠాత్తుగా కాల్పులకు దిగుతోంది. ఎల్ఓసీ మాత్రమే కాకుండా అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ కాల్పులు జరిపింది ఇదివరకు.
వ్యూహాత్మకంగా అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలుగా భావించే జమ్మూ జిల్లా పర్గ్వాల్ సెక్టార్ పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై కొద్దిరోజుల కిందటే ఈ కాల్పులకు దిగింది పాకిస్తాన్. దీన్ని భారత జవాన్లు విజయవంతంగా తిప్పి కొట్టారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆ దేశ ఆర్మీ చీఫ్తో భారత సైన్యాధిపతి హాట్లైన్లో సైతం మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినప్పటికీ- తన బుద్ధి పోనిచ్చుకోవట్లేదు పాక్.












Click it and Unblock the Notifications