ముంబైలోని ఆ ఇల్లు మాదే.. అది మా దేశ ఆస్తి : పాకిస్తాన్
ముంబైలోని జిన్నా ఇంటిపై తమ ప్రభుత్వానికి ఉన్న యాజమాన్య హక్కును భారత సర్కారు గౌరవించాలని పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ: తమ దేశ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఇంటిని తమకు అప్పగించాలంటూ పాకిస్తాన్ కోరింది. ముంబైలోని జిన్నా ఇంటిపై తమ ప్రభుత్వానికి ఉన్న యాజమాన్య హక్కును భారత సర్కారు గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.
ఆ ఇంటిని భారత ప్రభుత్వం పరిరక్షిస్తుందన్న నమ్మకాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వ్యక్తం చేశారు. ముంబైలో ఉన్న జిన్నా ఇల్లు తమ దేశ ఆస్తి అని పేర్కొన్నారు.
దానికి పాకిస్తాన్ కు అప్పగిస్తామని చాలా సందర్భాలలో భారత్ హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేదని జకారియా వ్యాఖ్యానించారు. దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా ప్యాలెస్ ను కూల్చివేసి, సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇటీవల వచ్చింది.
మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్ మంగల్ ప్రభాత్ లోధా ఈనెల 25న ఆ రాష్ట్ర అసెంబ్లీలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ముంబైలోని జిన్నా హౌస్ ను ప్రభుత్వ ఆస్తి అని పేర్కొన్నారు. దాని నిర్వహణకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు.