రమ్యకు ప్రేమతో..: రాత్రికి రాత్రే పాకిస్తాన్లో సెలబ్రిటీగా
బెంగళూరు: కన్నడ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్య మరోసారి మీడియా సెలబ్రిటీగా మారిపోయారు. పాక్ను పొగిడి భారత్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రమ్య పైన పాకిస్తాన్ ప్రేమ కురిపిస్తోంది. పాకిస్తాన్ నరకం కాదు అని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు.
దానిపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. దేశద్రోహం కేసు కూడా నమోదయింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలు ప్రధాన శీర్షిక అవుతోంది.
పాకిస్తాన్ను పొగిడిన నటి రమ్య, దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
పాకిస్తాన్ను ప్రశంసించినందుకు భారతీయ నటి పైన దేశద్రోహం కేసు పెట్టారని డాన్ పత్రిక కథనం ప్రచురించింది. అంతేకాదు పాఠకుల అభిప్రాయాలను ఆహ్వానించింది. పాకిస్తాన్కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలకు భారత నటి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిందని డైలీ పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ నరకం కాదు.. ఇట్లు రమ్య శీర్షికన డైలీ టైమ్స్ కథనం రాసింది.
రమ్య అసలు పేరు దివ్య స్పందన అని, పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడినందుకు ఆమె పైన దేశద్రోహం కేసు పెట్టారని జియో న్యూస్ వార్తా ఛానల్ తెలిపింది. పాఠకులు మాత్రం భారత్, పాకిస్తాన్ పట్ల సానుకూల వైఖరి వ్యక్తం చేయడం గమనార్హం.