శశికళకు పన్నీరుసెల్వం మరో షాక్: గతంలో జయకు శశికళ లేఖ, ఏముందంటే..?
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మధ్య సీఎం పదవి పోరు కొనసాగుతోంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మధ్య సీఎం పదవి పోరు కొనసాగుతోంది. తాజాగా శశికళకు మరో షాక్ ఇచ్చారు పన్నీరు సెల్వం. ఆ వివరాల్లోకి వెళితే.. 2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్ గార్డెన్ నుంచి బయటకు గెంటివేశారు.
ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ.. జయలలితకు లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖను పన్నీర్ సెల్వం బయటపెట్టారు. ఆ లేఖలో ఏముందంటే.. 'మా బంధువులు, మిత్రులు కొంతమంది నేను పోయ్సగార్డెనలో కలిసి ఉంటున్న సమయంలో నా పేరుని వాడుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అన్నాడీఎంకేకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు' అని శశికళ తెలిపారు.

అంతేకాకుండా 'మీకు(జయలలితకు) వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగాయి. కలలో కూడా నేను మీకు ద్రోహం తలపెట్టను. నా బంధువులు అక్రమాలకు పాల్పడ్డారు. ఇది మన్నించరానిది. నేను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలనిగానీ, పార్టీ పదవులు కట్టబెట్టాలని ఏనాడూ కోరలేదు' అని శశికళ స్పష్టం చేసింది.
'అసలు ప్రజా జీవితంలో ప్రవేశించాలన్న ఆశ నాకెప్పటికీ రాలేదు. నా జీవితాన్ని మీ కోసమే అర్పించాను. నన్ను క్షమించి మళ్లీ దగ్గరకు తీసుకోండి' అని ఆ లేఖలో శశికళ.. జయకు విన్నవించుకున్నారు. కాగా, తనకు తెలిసిన విషయాల్లో 10 శాతమే బయటపెట్టానని, ఇంకా 90 శాతం తనలోనే ఉందని పన్నీర్ చెప్పని విషయం తెలిసిందే. ఆ 90శాతం కూడా బయటపెడితే శశికళకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications