సభలో కదలకుండా కెవిపి, ప్రతులు చించిన తమిళ ఎంపి
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం పార్లమెంటులో ఉభయ సభలను కుదిపేస్తోంది. బుధవారం ఉదయం లోకసభ, రాజ్యసభలు ప్రారంభమైన కాసేపటికే సభ్యుల ఆందోళన కారణంగా గంటపాటు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో సీమాంధ్ర కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
కెవిపి రామచంద్ర రావు మూడు రోజులుగా పోడియం వద్ద 'వి వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్' అనే ప్లకార్డును ప్రదర్శిస్తున్నారు. ఆయన ప్లకార్డును పట్టుకొని అలాగే కదలకుండా నిలబడుతున్నారు. మిగతా ఎంపీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా, సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేస్తున్నారు. లోకసభలోను సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేశారు. రాజ్యసభలో కెవిపి, సిఎం రమేష్, సుజనా చౌదరిలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.

ఏఐఎడిఎంకె సభ్యులు మైత్రేయన్ ప్రతులను చించి గాల్లోకి విసిరారు. సభ్యులు వెల్లోకి దూసుకు వచ్చారు. ఉభయ సభల్లో స్పీకర్, చైర్మన్లు సభ నడిచేందుకు సహకరించాలని సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేశారు. తమిళనాడు మత్స్యకారుల సమస్యలపై తమిళ ఎంపీలు ఆందోళన చేశారు. పరిస్థితిలో మార్పు కనిపించక పోవడంతో గంటపాటు వాయిదా వేశారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్లమెంటు గేట్ వద్ద నిరసన తెలిపారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కావడం వల్లనే బిల్లులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. టి బిల్లు పైన అనుమానాలు కలుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications