రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు..! 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం..!!
ఢిల్లీ/హైదరాబాద్ : ఈనెల 17నుండి అంటే రేపటి సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలు రేపు మొదలై జూలై 26న ముగియనున్నాయి. మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక,పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ సమావేశమయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో పార్లమెంట్ సమావేశాలు గురించి చర్చించనున్నారు.
ఈ భేటీకి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి కేశవరావు, నామ నాగేశ్వరరావు.. టీడీపీ నుంచి గల్లా జయదేవ్,రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు.ఇక.. పార్లమెంట్ సమావేశాల మొదటి రెండు రోజులు లోక్సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 19న స్పీకర్ ఎన్నిక జరగనుంది. 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసగిస్తారు. జూలై 5న కేంద్ర బడ్జెట్ను మోడీ సర్కార్ ప్రవేశపెట్టనుంది.పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం దిల్లీలో అన్ని పార్టీల సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలంటూ పార్టీల అధినేతలను కేంద్రం తమ లేఖలో కోరింది. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయా పార్టీల అధ్యక్షులకు ప్రత్యేకంగా లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రావు లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి లేఖ అందింది. ఈ నెల 19న సమావేశం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications