పంజాబ్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్: మాజీ కేంద్రమంత్రి అశ్వనీకుమార్ రాజీనామా
చండీగఢ్: మరికొద్ది రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందనగా.. అధికార కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశ్వనీ కుమార్ మంగలవారం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీని వీడాలనే నిర్ణయం బాధాకరమేనని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తన గౌరవానికి తగ్గట్లుగా, జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ బయటే ఉత్తమ సేవలు అందించగలనని భావిస్తున్నట్లు అశ్వనీ కుమార్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోలేకపోయిందని, క్రమంగా క్షీణిస్తూనే ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పార్టీ నాయకత్వం గుర్తించలేకపోతోందని అన్నారు.

తన భవిష్యత్ కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న అశ్వనీకుమార్.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. కాగా, అశ్వనీ కుమార్కు కాంగ్రెస్ పార్టీతో దాదాపు నాలుగున్నర దశాబ్దాలకుపైగా అనుబంధం ఉండటం గమనార్హం. యూపీఏ హయాంలో ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సోనియా గాంధీకి విధేయుడిగా పేరుంది.
జీ-23గా పేరొందిన 23 మంది సీనియర్ నాయకులు.. 2020 ఆగస్టులో పార్టీలో భారీ మార్పులకు పిలుపునిస్తూ సోనియాకు లేఖ రాసినప్పుడు కూడా.. అశ్వనీకుమార్ తమ అధినేత్రికే మద్దతుగా ఉన్నారు. కాగా, ఇటీవల సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు, గులాంనబీ ఆజాద్కు పద్మభూషణ్ తదితర అంశాలపై సాగిన వివాదాలు కూడా తన రాజీనామా నిర్ణయానికి మరింత బలం చేకూర్చాయని అశ్వనీకుమార్ తెలిపారు.
అంతేగాక, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కూడా అశ్వనీకుమార్ తప్పుబట్టారు. రాష్ట్రంలో సీఎం అభ్యర్థిత్వంపై చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు బహిరంగంగా పోటీ పడటాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఎదురవుతోందని అన్నారు. కాగా, ఫిబ్రవరి 20న పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి












Click it and Unblock the Notifications