మధ్యప్రాచ్యలో యుద్ద వాతావరణం.. వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు
ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమనిని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో మధ్యప్రాచ్యలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. ఇటు చమురు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ముడిచమురు బ్యారెల్కు 4.5 శాతం పెరిగి 69.20 డాలర్లకు చేరడంతో భారతదేశంలో ఆయిల్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్షించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నామని.. పెరిగిన ధరలు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అమలవుతాయని తెలిపాయి.
గతేడాది సెప్టెంబర్లో సౌదీ ముడి చమురు స్థావరాలపై దాడి జరిగిన తర్వాత పెట్రో ఉత్పత్తుల ధర పెరగడం ఇదే తొలిసారి. ఢిల్లీ, ముంబైలోకి లీటర్ పెట్రోల్కు 10 పైసలు, కోల్కతా, చెన్నైలో 11 పైసలు, ఢిల్లీ కోల్కతాలో లీటర్ డీజిల్ 15 పైసలు, ముంబై, చెన్నైలో 16 పైసల చొప్పున పెరగనున్నాయి. గత మూడు రోజుల నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 15 నుంచి 21 పైసల వరకు పెట్రోల్, 23 నుంచి 29 పైసలు డీజిల్ ధర పెరిగిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ స్థాయిలో ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీగా సమీక్షిస్తాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ ధరను సమీక్షించి, నిర్ణయించడంతో మరుసటి రోజునుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. 2017 జూన్ నుంచి ఆయిల్ సంస్థలు రోజువారీ ధరలను సమీక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో రోజువారీగా సమీక్షించి, పెంచుతూ, తగ్గిస్తూ ఉన్నాయి.
ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమని మృతితో మధ్యప్రాచ్యలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కువైట్ ఎయిర్బేస్లో అమెరికాకు చెందిన దాదాపు మూడు వేల మంది సైనిక బలగాలను మొహరించారు. ఇరాక్లోని అమెరికా రాయబారి కార్యాలయం వద్ద నిరసనల తర్వాత అమెరికా బలగాలను మొహరించడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సొలెమనీ హత్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందెమోనని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.