ఓటెయ్యండి .. మీ పిల్లల ఫైనల్ పరీక్షల్లో 10 మార్కులు బోనస్ గా కలుపుతాం
ఓటు సామాన్యుడి ఆయుధం . ఓటు భవిష్యత్ తరాల బంగారు భవితకు దిక్సూచి. ప్రజాస్వామ్యానికి ప్రతీక. అలాంటి ఓటుహక్కు ఉన్నా మనలో చాలా మందికి ఓటువెయ్యాలంటే మాత్రం ఆసక్తి ఉండదు. ఓటేస్తే నాకేంటి ? అన్న ప్రశ్న చాలా మందిని ఓటు వెయ్యకుండా నిర్లక్ష్యం చేసేలా చేస్తుంది. నా ఒక్కడి ఓటు వెయ్యకుంటే ఏమన్నా మునిగిపోతుందా అని ఆలోచించేవారు కొందరు. ఇక ఓటెయ్యటానికి లైన్లో నిలబడాలా ? నా వల్ల కాదు అని బద్దకించే వారు మరికొందరు ఓటుహక్కు ఉన్నా వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు .ఇక ఆ రోజు సెలవు వుంటుంది కాబట్టి ఏ సినిమాకో, షికారుకో వెళ్ళాలనుకునేవారు మరికొందరు . ఇలా చాలా మంది ఓటుహక్కు ఉన్నా ఓటు వెయ్యకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఓటు హక్కే కాదు బాధ్యత అని మరచిపోతున్నారు.
ఏపి ఎన్నికలకు అంతా సిద్దం ,ఎన్నికల ప్రధానధికారి ద్వివేది
ఓటుహక్కు వినియోగించుకోవాలని ఓ కళాశాల వినూత్న ఆలోచన
ఓటెయ్యండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని ఎవరు ఎంతగా చెప్పినా, ప్రభుత్వాలు ఊదరగొట్టినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది . ఇక ఓటరుచైతన్య కార్యక్రమాలు . ఓటరు అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఫలితం కనిపించటం లేదు. అందుకే ఓటర్లలో చైతన్యం తెచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చెయ్యటానికి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక కళాశాల వారు . ఓటర్లకు తాయిలాలు ఇచ్చి లేదా నచ్చజెప్పి ఓట్లను వెయ్యాలని చెప్పటంలేదు. సెంటిమెంట్ తో కొడుతున్నారు.
ఓటెయ్యండి .. మీ పిల్లల ఫైనల్ ఎగ్జామ్స్ లో 10 మార్కులు బోనస్ గా పొందండి అంటూ ప్రచారం చేస్తున్న కళాశాల
ఓటుహక్కు వినియోగించుకున్న వారి కోసం ఒక మంచి ఆఫర్ ప్రకటించారు .ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకు. ‘‘తల్లిదండ్రులు ఓటేస్తే పిల్లలకు పది మార్కులు అదనంగా బోనస్ గా కలుపుతాం" ఇదే బంపర్ ఆఫర్ ప్రకటించారు. తల్లిదండ్రులతో ఓటేయిస్తే ఫైనల్ రిజల్ట్స్ లో పది మార్కులు కలుపుతామని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆర్కే ఛత్రీ చెప్పారు. చెప్పడమే కాదు గేటుకు పెద్ద బ్యానర్ కూడా కట్టారు ఆకాలేజ్ యాజమాన్యం.
ఓటరు చైతన్యం కోసం వినూత్న ఆలోచన .. పిల్లల మార్కుల కోసం తల్లిదండ్రుల ఉత్సాహం
ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం. భావి తరాల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందంటూ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ ఓటేయండి. ఓటు వేసిన వారి పిల్లలకు ఫైనల్ రిజల్ట్స్ లో పది మార్కులు అదనంగా కలుపుతాం" అని ఆ బ్యానర్లో రాసి ఉంది . ఇక ఓటు హక్కు వినియోగించుకున్నట్టు వేలిపై సిరాచుక్క చూపిస్తే వారి పిల్లలకు బోనస్ మార్కులు యాడ్ అవుతాయి. ఇప్పటికే దేశంలోని చాలా స్కూళ్లు, కాలేజీలలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ ఈ వినూత్న ఆలోచన మాత్రం చాలా మంది పేరెంట్స్ తో ఓటు వేయించేలాగే ఉంది . ఇక ఆ కళాశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల మార్కుల కోసం అయినా కచ్చితంగా ఓటు వేసి తీరాల్సిందే.