మన్మోహన్లా కాదు: నరేంద్ర మోడీ రూటే వేరు!
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్ర మోడీ తన పని మొదలుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లా కాకుండా తన నాయకత్వంలో పని చేసే కేంద్రమంత్రులకు గురువారం దృఢమైన సూచనలు చేశారు. అంతేగాక కఠినమైన మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. ఏ మంత్రి కూడా తమ అధికార పరిధిని మించకుండా పరిమితులు విధించారు.
పలు జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం... నరేంద్ర మోడీ ఆయన మంత్రివర్గ సభ్యులకు పది మార్గదర్శకాలను జారీ చేసినట్లు సమాచారం. సంస్కరణలతో ఆర్థిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, మంత్రివర్గ సభ్యుల మధ్య సమన్వయ వ్యవస్థ ఉండాలని, ప్రజాభీష్ణంగా విధానాలు ఉండేలా చూసుకోవాలని, ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సహచరులతో మోడీ అన్నారు.

వాటిని ఒక్కసారి పరిశీలించినట్లయితే..
1. అధికారుల్లో ఆత్మవిశ్వాసం కలిగించడం
2. సాంకేతిక, సోషల్ మీడియాను ఉపయోగించడం
3. మౌలిక వసతులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి
4. సిబ్బందిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం
4. సుస్థిర, సుపరిపాలన అందించడం
5. ఈ-టెండరింగ్ ద్వారా పనుల కేటాయింపు
6. పాలనలో పారదర్శకత తీసుకురావడం
7. సకాలంలో పథకాలు, పనులు పూర్తి చేయడం
8. పటిష్టమైన ప్రభుత్వ పాలన కోసం కొత్త ఆలోచనలను స్వాగతించడం
9. నిర్ణీత సమయంలోగా విధానాలు అమల్లోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి
10. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం
వీటితోపాటు పలు సూచనలు కూడా మంత్రివర్గ సభ్యులకు మోడీ నిర్దేశించారు. సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. సిబ్బంది నియామకాల్లో బంధు ప్రీతిని ప్రదర్శించరాదని మోడీ మంత్రివర్గ సభ్యులకు సూచించారు. మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
ఎవరికి సంబంధించిన శాఖ గురించి వారు మాత్రమే మాట్లాడాలని నిర్దేశించారు. మన్మోహన్ నాయకత్వంలోని యుపిఏ-2 చేసిన తప్పులు పొరపాటున కూడా చేయకూడదని మోడీ భావిస్తున్నట్లు తెలిసింది. యుపిఏ ప్రభుత్వంలో 2జి, కోల్ స్కాం లాంటి పలు కుంభకోణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications