టి బిల్లుపై కమల్: ప్రధానికి బిజెపి హామీ, కానీ..తిరకాసు
న్యూఢిల్లీ: పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లును ఎప్పుడు ప్రవేశ పెట్టాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ బుధవారం చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు తన నివాసంలో విందు ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని కోరేందుకే ప్రధాని ఈ విందు ఏర్పాటు చేశారు.
విందు అనంతరం కమల్ నాథ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశ పెట్టాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ బిల్లుకు బిజెపి సంపూర్ణ మద్దతు తెలిపిందని అన్నారు. బిల్లు పాస్ అవుతుందని కమల్ ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు లోకసభలో, రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము మొదటి నుండి కట్టుబడి ఉన్నామని, హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు తాము మద్దతిస్తామని అదే సమయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. బిల్లుకు మద్దతిచ్చే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పారు.
ఈ విందులో లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, కేంద్రమంత్రులు చిదంబరం, కమల్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గురువారం లోకసభలో తెలంగాణ బిల్లు పెట్టనున్న విషయం తెలిసిందే.
మీ సంగతి చూసుకోండి
తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని చెప్పిన బిజెపి నేతలు ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోవాలని భేటీలో సూచించారట. కేంద్రమంత్రులు కూడా వెల్లోకి వస్తున్నారని, తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టే సమయంలో సభలో ఎలాంటి నినాదాలు లేకుండా చూడాలన్నారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించి బిల్లు పెట్టాలని కోరారు. కాగా, సాయంత్రం తెలంగాణ బిల్లుపై కేబినెట్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
సాయంత్రం కేబినెట్ భేటీ
కేంద్రం కేబినెట్ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు సమావేశంకానుంది. పోలవరం ముంపు ప్రాంతాలు, సీమాంధ్రలో కలపడంపై కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications