కేబినెట్ మీటింగ్స్లో సెల్ ఫోన్పై నిషేధం! : మోడీ సర్కార్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి గోప్యత పాటించాలనే ఉద్దేశ్యంతో.. కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని మోడీ సర్కార్. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశాలకు సైతం సెల్ ఫోన్లను నిరాకరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే అవకాశముండడంతో.. సెల్ ఫోన్లపై నిషేధం విధించాలని నిర్ణయించుకుంది కేంద్రం. తాజా నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే కేంద్రమంత్రుల ప్రైవేటు కార్యదర్శులకు చేరవేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా యూరీ ఉగ్ర ఘటన తర్వాత అటు పాక్ తోను, ఇటు చైనాతోను భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోండగా.. అక్కడి హ్యాకర్లు కేంద్ర పరిధిలోని సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సెల్ ఫోన్లపై నిషేధం విధించింది.
ఫ్రాన్స్, బ్రిటన్ లో ఇప్పటికే నిషేధం :
సెల్ ఫోన్లపై కేంద్ర సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకోగా.. ఈ నిషేధాన్ని ఇప్పటికే కొనసాగిస్తున్నాయి ఫ్రాన్స్, బ్రిటన్ ప్రభుత్వాలు. అక్కడి కేబినెట్ మీటింగ్స్ కు సెల్ ఫోన్ నిషిద్దం. మే, 2010లో సెల్ ఫోన్లపై నిషేధం విధిస్తూ అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫ్రాన్స్ లో 2014, ఏప్రిల్ నుంచి కేబినెట్ మీటింగ్స్ కు సెల్ ఫోన్ ను నిషేధించారు.