మోదీ సీరియస్.. రాష్ట్రాల మధ్య నీటి గొడవలకు కీలక సూచన ..
రాష్ట్రాల మధ్య తలెత్తే నీటి వివాదాలను పరస్పర సహకారం, సకాలంలో అనుమతులు ఇవ్వడం, సరికొత్త సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగుతున్న 'కెన్-బెత్వా' నదుల అనుసంధాన ప్రాజెక్టు దేశానికే ఒక గొప్ప ఆదర్శంగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో నిర్వహించిన 51వ 'ప్రగతి' (PRAGATI) వెబ్క్యాస్ట్ సమావేశంలో ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షలో రైల్వేలు, విద్యుత్, రహదారి రంగాలకు చెందిన సుమారు రూ.30,000 కోట్ల విలువైన ఏడు భారీ ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని పరిశీలించారు. ప్రభుత్వ పనుల అమలులో అనవసర జాప్యం చేయడం వల్ల ప్రాజెక్టు వ్యయం విపరీతంగా పెరిగిపోతుందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పనులు ఆలస్యమైతే ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు సకాలంలో అందకుండా పోతాయని అధికారులను హెచ్చరించారు. నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, ఆధునిక నీటిపారుదల పద్ధతుల ద్వారా దేశంలో దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించేందుకు అన్ని రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.

రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టులపై ఫోకస్
విద్యుత్ రంగాన్ని సమీక్షించిన ప్రధాని.. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు, నివాస సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో రూఫ్టాప్ సోలార్ (భవనాలపై సౌర విద్యుత్) అమరికను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కరెంట్ బిల్లుల ఖర్చును తగ్గించడానికి, ఇంధన భద్రతను పెంచడానికి క్లీన్ ఎనర్జీని ఒక 'మిషన్ మోడ్' ఉద్యమంలా చేపట్టాలన్నారు. ఇందులో భాగంగానే సాగునీటి కాలువల వెంబడి, కాలువలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే సరికొత్త విధానాన్ని అన్వేషించాలని రాష్ట్రాలకు సూచించారు. దీనివల్ల అదనపు భూమి అవసరం లేకుండానే విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని, ఎండ తీవ్రతకు నీరు ఆవిరైపోకుండా అడ్డుకోవచ్చని వివరించారు.
దేశ ప్రవేశ ద్వారంగా వధావన్ పోర్ట్
మహారాష్ట్రలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక వధావన్ పోర్ట్ ప్రాజెక్టును కేవలం ఒక ఓడరేవులా కాకుండా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రధాని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు తీరప్రాంత షిప్పింగ్, అంతర్గత జలమార్గాలు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు (Freight Corridors), హైస్పీడ్ రైళ్లు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలతో సజావుగా అనుసంధానమవ్వాలన్నారు. ఇది భారతదేశ రవాణా రంగానికి ఒక అంతర్జాతీయ ప్రవేశ ద్వారంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వచ్ఛ భారత్ 2.0 విజయవంతం కావాలి
కేవలం మౌలిక వసతుల కల్పనతోనే సరిపెట్టకుండా, నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో 'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0' లో స్పష్టమైన ఫలితాలు సాధించాలని మోదీ నొక్కిచెప్పారు. పట్టణాల్లో తడి, పొడి వ్యర్థాల శుద్ధి కర్మాగారాలు, గోబర్ధన్ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కేంద్ర విభాగాలు, రాష్ట్రాలు మరింత చురుకైన కాలపరిమితి విధానాన్ని అనుసరిస్తూ అడ్డంకులను తొలగించాలని కోరారు.
సమావేశం ప్రారంభంలో క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ మాట్లాడుతూ.. ప్రధాని ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో సామాజిక రంగ పథకాలపై ప్రతి నెలా సమీక్ష జరిపే నూతన పర్యవేక్షక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో జవాబుదారీతనాన్ని పెంచే ఈ కొత్త విధానంలో భాగంగానే, స్వచ్ఛ భారత్ మిషన్ అమలును తొలిసారిగా రాష్ట్రాల వారీగా సమీక్షించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.














Click it and Unblock the Notifications