ఇది భారతావని విజయం - కొత్త చరిత్ర లిఖించాం : ప్రపంచ దేశాలు మనవైపే - ప్రధాని మోదీ..!!
అక్టోబర్ 21 నాటికి వంద కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేయటం భారతావని సాధించిన విజయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఇది సాధ్యం అయిందన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ కరోనా కారణంగా ఏర్పడిన కష్ట - నష్టాలు వివరిస్తూ..ఏ రకంగా ఎదుర్కొందీ వివరించారు. భారత విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పుకొచ్చారు. మహమ్మారిని విజయవంతంగా.. సమర్దవంతంగా ఎదుర్కొన్నామని ప్రధాని చెప్పారు.

ప్రపంచం కొనియాడుతోంది..
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చామని వివరించారు. ఈ విజయం తో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. అన్ని వర్గాలకు వ్యాక్సిన్ అందించామని..ఇందులో ధనికులు..పేదవారు అనే తేడా లేకుండా ఒకే విధంగా వ్యవహరించామని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో వంద కోట్ల వ్యాక్సిన్ పూర్తి చేయటం గొప్ప కార్యక్రమంగా పేర్కొన్నారు. సబ్ కా సాథ్..సబ్ కా వికాస్..సబ్ కా వ్యాక్సిన్ అనే నినాదం భారత్ తీసుకుందని చెప్పారు. ఇది కొత్త చరిత్రగా ప్రధాని అభివర్ణించారు.

ఇది దేశ సంకల్ప బలం చాటేందుకు
వంద కోట్ల డోసులు అనేది లెక్క కాదని..ఇది దేశ సంకల్పమని వివరించారు. భారత ఫార్మా శక్తి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. డెవలప్ అయిన దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవటానికి ముందుకు రావట్లేదని చెప్పారు. కరోనా మహమ్మారి భారత్ కు పెద్ద సవాలే విసిరిందని గుర్తు చేసారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ మైలు రాయిని చేరుకున్నామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద దేశానికి టీకాల సరఫరా అనేది సవాలే అన్నారు. సబ్ కా సాత్ లక్ష్యంతో పని చేసామని ప్రధాని చెప్పారు. కరోనాను ఎదుర్కొనే శక్తి దేశానికి లభించిందని పేర్కొన్నారు.

సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లాం..
మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేరవేయడం ఓ భగీరథ ప్రయత్నమని... దాన్ని సాధించామని చెప్పారు. వ్యాక్సిన్ల కొరతను అధిగమించామన్నారు. ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్ అవసరం అనేది ముందుగానే గ్రహించి.. దానికి అనుగుణంగా టీకాలను అందించామని చెప్పారు. ఈ ప్రయత్నంలో ముందు నిలిచిన హెల్త్ వర్కర్లు..ఫ్రంట్ లైన్ వారియర్స్ ను ప్రధాని అభినందించారు. కరోనా కట్టడికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని..సమిష్టిగా ఈ మహమ్మారిని ఎదుర్కొన్నామని మోదీ వివరించారు.

వోకల్ ఫర్ లోకల్ను ప్రమోట్ చేయాలి
మేడిన్ ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాని... వోకల్ ఫర్ లోకల్ను ప్రమోట్ చేయాలని కోరారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగం పుంజుకుంటుందని ప్రధాని వివరించారు. వ్యాక్సిన్ కవరేజీకి తోడుగా ఆర్థిక పరిస్థితులు, టూరిజం, ఎంటర్టైన్మెంట్, స్టార్టప్స్.. ఇవన్నీ మళ్లీ వేగంగా పుంజుకుంటోన్నాయని చెప్పారు. పండగల సీజన్లో ఇవన్నీ మరింత శరవేగంగా ముందుకు వెళ్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసారు.

కరోనా పైన పోరాటం ముగియలేదు....
కరోనాపై పోరాటం ఇంకా ముగియలేదని... ఇంకా పోరాడాల్సి ఉందని ప్రధాని చెప్పారు. ఈ పండగ సీజన్లోనూ అప్రమత్తంగా ఉండక తప్పదని సూచించారు. మాస్కులను ధరించాల్సిందేనని...పాదరక్షలను ధరించడాన్ని మనం ఎలా అలవాటు చేసుకున్నామో.. మాస్కులను ధరించడాన్ని కూడా అలాగే అలవాటు చేసుకోవాలని చెప్పారు. విస్మరించవద్దని ప్రజలను కోరారు. గత సంవత్సరం దీపావళి పండగ సందర్భంగా దేశ ప్రజల్లో ఒకరకమైన ఆవేదన, ఆందోళన వ్యక్తమైందన్నారు. ఈ దీపావళికి ఆ పరిస్థితి లేదు. అందరిలోనూ ఆత్మవిశ్వాసం తొణికిస లాడుతోంది. చిన్న దుకాణాలు, చిరు వ్యాపారులకు ఇది ఆశాకిరణంలా మారిందని చెప్పారు ప్రధాని మోదీ.












Click it and Unblock the Notifications