భద్రతపై ప్రధాని మోడీ భార్య జశోదా బెన్ అసంతృప్తి
అహ్మదాబాద్: తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మోడీకి, జశోదా బెన్కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, మోడీ ప్రధాని అయిన తర్వాత నిబంధనల ప్రకారం జశోదాకు భద్రత కల్పించారు.
అయితే, ఆ భద్రత ఏర్పాట్లపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి భార్యగా నిబంధనల ప్రకారం తనకు ఏ స్థాయి భద్రత కల్పించాలి, ప్రస్తుతం ఎంతమేరకు భద్రత కల్పించారని అడుగుతూ సోమవారం ఆమె సమాచార హక్కు చట్టం కింద గుజరాత్లోని మెహసానా జిల్లా పోలీసులకు దరఖాస్తు దాఖలు చేశారు. తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన యాక్చువల్ ఆర్డర్ ధ్రువీకృత కాపీ సహా పలు పత్రాలను తనకు ఇవ్వాల్సిందిగా అందులో కోరారు. తన గార్డులు కార్ల వంటి ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తుండగా, ప్రధాని భార్యనై ఉండీ తాను బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణిస్తున్నానని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె గార్డులే.. పైగా ఆమె ప్రధానిగా ఉన్న సమయంలోనే కాల్చి చంపారని జశోదా బెన్ గుర్తు చేశారు. తన గార్డుల పట్ల కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు. తన భద్రత కోసం నియోగించే గార్డుల నియామక పత్రాన్ని తనకు సమర్పించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. జశోదాబెన్ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన విషయాన్ని మెహసానా ఎస్పీ జేఆర్ మొథాలియా ధ్రువీకరించారు.
సోమవారం ఆమె మా కార్యాలయానికి వచ్చారని, ప్రధాని భార్యగా తనకు ఎలాంటి భద్రత కల్పించారో తెలపాల్సిందిగా కోరుతూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు దాఖలు చేశారని, ఆమెకు మేం నిర్ణీత సమయంలో సమాధానం ఇస్తామని ఆయన వివరించారు. జశోదా బెన్ ప్రస్తుతం తన సోదరుడు అశోక్ మోదీతో కలిసి మెహసానా జిల్లా(గుజరాత్)లోని ఊంఝా పట్టణంలో ఉంటున్నారు.
జశోదాబెన్ భద్రత కోసం పది మంది పోలీసులను నియోగించారు. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున ఒక్కో షిఫ్టులో ఐదుగురు పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తున్నట్టు మెహసానా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్వోజీ) పోలీస్ ఇన్స్పెక్టర్ జేఎస్ చావ్డా వివరించారు.












Click it and Unblock the Notifications