రాత్రి జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం..! సీజ్ ఫైర్ విమర్శల వేళ..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను త్రివిధ దళాలు విజయవంతంగా పూర్తి చేయడం, ఆ తర్వాత పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కొనసాగుతుందని తాజాగా ప్రకటించిన ప్రధాని మోడీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్దమవుతున్నారు.
ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ పై ఎన్నో విజయాలు సాధించింది. ఉగ్రవాద శిబిరాలపై ప్రారంభించిన దాడులు ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు, సైనిక స్థావరాల వరకూ వెళ్లాయి. అంతే కాదు ప్రతీకారంగా పాకిస్తాన్ పంపిన డ్రోన్లను సైతం భారత వాయుసేన విజయవంతంగా కుప్పకూల్చింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చింది.

ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్న తరుణంలో ఇలా అకస్మికంగా కాల్పుల విరమణ ప్రకటించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ పై దాడి చేసి విజయం సాధించేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని కాదని ట్రంప్ మాట విని కాల్పుల విరమణ ప్రకటించడం ఆత్మహత్యా సదృశ్యమనే విమర్శలు వస్తున్నాయి. అంతే కాదు ఈ కాల్పుల విరమణ ప్రకటన చేసిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీని, ఆయన కుటుంబాన్ని సైతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయినా ప్రదాని మోడీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్దమయ్యారు. ఇవాళ రాత్రి 8 గంటలకు టీవీల్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఇందులో ఆపరేషన్ సింధూర్ నుంచి కాల్పుల విరమణ, ఆ తర్వాత చర్చల వరకూ సాగిన పరిణామాల్ని వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిధ దళాలు ఆపరేషన్ లో తాము సాధించిన విజయాల్ని ఆధారాలతో సహా ఏకరువు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications