వ్యాక్సిన్ తయారీదారులతో నేడు ప్రధాని భేటీ-భారత్ బయోటెక్, సీరం సహా ఏడుగురికి ఆహ్వానం
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో వందకోట్ల డోసుల మైలురాయికి భారత్ చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ భారతీయ వ్యాక్సిన్ దారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి భారత్ కు చెందిన ఏడుగురు వ్యాక్సిన్ తయారీదారుల్ని ఆహ్వానించారు. భారత్ లో మిగిలిన ప్రజలకు వ్యాక్సిన్లు వేసేందుకు ఆయా సంస్ధల నుంచి తీసుకోవాల్సిన సహకారంపై ప్రధాని చర్చించే అవకాశముంది.
ఇవాళ ప్రధాని మోడీతో భేటీకి ఆహ్వానించిన వ్యాక్సిన్ తయారీదారుల్లో భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్, రెడ్డీస్ ల్యాబ్, జైడూస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెన్నోవా బయో ఫార్మా, పనాసియా బయోటెక్ వంటి సంస్ధలున్నాయి. భారతదేశంలోని అర్హులైన వ్యక్తులకు వీలైనంత త్వరగా టీకాలు వేయడం మరియు ఇతర దేశాలు తమ జనాభాకు టీకాలు వేయడంలో సహాయపడటం వంటి మార్గాల గురించి ప్రధాని మోదీ నొక్కి చెప్పే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 101.30 కోట్ల వ్యాక్సిన్లు వేశారు. అక్టోబర్ 21న భారత్ వంద కోట్ల వ్యాక్సిన్ల మైలురాయి దాటింది. కేంద్రం దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తోంది. మిగిలిన భారతీయులకు కూడా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులు, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతోంది. కరోనా ఫ్రీ భారత్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మిగిలిన వ్యాక్సిన్ తయారీదారుల్ని కూడా సహకరించాలని ప్రధాని ఇవాళ కోరే అవకాశముంది. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతులు, ఇతర అంశాల్లో సహకరిస్తామని ప్రధాని మోడీ వారికి చెప్పబోతున్నారు.