టొబాకో వ్యతిరేకం దినం: నరేంద్ర మోడీ సందేశం
న్యూఢిల్లీ: పొగాకు వాడకం వల్ల వచ్చే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు పిలుపునిచ్చారు. శనివారం పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ‘పొగాకు వాడకంపై సమస్యలను తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం' అని నరేంద్ర మోడీ ట్విట్టర్లో సందేశాన్ని పంపారు.
పొగతాగే వారితో పాటు ఆ ప్రభావం అతడి చుట్టూ ఉన్న వారిపైనా పడుతుందని పేర్కొన్నారు. పొగాకు వాడకాన్ని నియంత్రించడం ద్వారా.. ఆరోగ్యమైన భారత్కు పునాదులు వేద్దామని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
పొగతాగడం వల్ల మనదేశంలో అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్న విషయం తెలిసిందే. పొగ తాగడం వల్ల పలు వ్యాధుల బారినపడి ప్రత్యక్షంగా రూ. 16, 800 కోట్లు, పరోక్షంగా 14,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రజలు పొగ తాగడానికి దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యంతోపాటు ఆర్థిక పరిస్థితి బాగుంటుందని సూచించారు.
పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం
నరేంద్ర మోడీ శనివారం తన నివాసంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై మోడీ వారితో చర్చించారు. త్వరలోనే కొన్ని కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని మోడీ వారికి తెలిపారు. 10 మంది ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బిజెపిని మరింత బలోపేతం చేయాలని, పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా పని చేయాలని వారికి సూచించారు.