తెలంగాణలో 4 రోజుల ముందే ఎగిరిన త్రివర్ణ పతాకం: 50 ఏళ్ల తర్వాత: ఆ కంచుకోట ఇకపై..!!
తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో ఒక అరుదైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 50 సంవత్సరాల తర్వాత అక్కడ మొదటిసారిగా జాతీయ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అయిదు రోజుల ముందే ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్.. త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. భద్రతపరంగా అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతంగా ముద్రపడిన కర్రెగుట్ట కొండల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం శాంతిభద్రతల పునరుద్ధరణలో ఓ కీలక మైలురాయిగా నిలిచింది.
సముద్ర మట్టానికి దాదాపు 650 అడుగుల ఎత్తులో ఉన్న కర్రెగుట్ట కొండలు.. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి ప్రధాన కేంద్రంగా ఉండేవి. తెలంగాణ వైపు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఛత్తీస్ గఢ్ వైపు బిజాపూర్, సుక్మా జిల్లాల్లో విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం ఇది. లోయలు, ప్రకృతిసిద్ధమైన గుహలు, జలపాతాలతో కూడిన ఈ సరిహద్దు ప్రాంతం దశాబ్దాల పాటు మావోయిస్టుల గెరిల్లా విభాగం పీఎల్జీఏ బెటాలియన్ నంబర్ 1కు సురక్షిత స్థావరంగా ఉంటూ వచ్చింది. మావోయిస్టుల డేగకన్ను, చుట్టూ మందుపాతరలతో ప్రభుత్వ, పోలీస్ యంత్రాంగానికి పెద్ద సవాల్ గా ఉండేది.

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ మిషన్ సంకల్ప్ ద్వారా భద్రతా బలగాలు కర్రెగుట్టపై పూర్తి పట్టు సాధించాయి. సుమారు 24,000 మంది బలగాలతో సాగిన ఈ ఆపరేషన్లో కోబ్రా, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ పోలీసు దళాలు ఉమ్మడిగా పాల్గొంటూ వచ్చాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మావోయిస్ట్ ఫ్రీ జోన్ గా మార్చేశాయి. అనేకమంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
ఈ పర్యటన సందర్భంగా ఆయన.. ఈ ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. భద్రతా దళాల సమన్వయ చర్యల వల్ల ఇప్పటివరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని, జనజీవన స్రవంతిలో కలిశారని వివరించారు. పలువురు అగ్రనేతలు వేర్వేరు ఎన్కౌంటర్ లల్లో మరణించినట్లు చెప్పారు.
ఓ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్ట ఎదిగేందుకు అనుకూల వాతావరణం ఉందని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. పామునూరు నుండి చలమడవ వరకు తారు రోడ్డు పూర్తయిందని, త్వరలోనే బీటీ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని అన్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో కూడా నిరంతరం శ్రమిస్తున్న సీఆర్పీఎఫ్ 196వ బెటాలియన్ జవాన్ల సేవలను సీవీ ఆనంద్ ప్రత్యేకంగా కొనియాడారు. వారి నిబద్ధత, నైపుణ్యాల వల్లే ఈ అటవీ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొందని ఆయన ప్రశంసించారు.
Today, on Day 3 of my district visits, I visited the Karreguttalu (KG Hills) area in the dense forest stretch of Telangana-Chhattisgarh border. This area was once a Maoist stronghold, with the extremists maintaining a firm hold over the region for several decades. Operation… pic.twitter.com/pvMImEHBsY
— CV Anand IPS (@CVAnandIPS) August 10, 2026
ఈ పర్యటనలో భాగంగా డీజీపీ స్థానిక గుత్తికోయ గిరిజన కుటుంబాలను కలుసుకున్నారు. వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గిరిజనులకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. దశాబ్దాలుగా భయాందోళనల నీడలో గడిపిన ఈ కర్రెగుట్ట ప్రాంతం ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్య వెలుగుల్లోకి వస్తోంది. గిరిజన గూడేలు, తండాలలో కనీస అవసరాలను కల్పించడం, రోడ్ కనెక్టివిటీ మెరుగుపరచడం ద్వారా సరిహద్దు ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు అటు రక్షణ దళాలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా ముందుకు సాగుతున్నాయి.




Click it and Unblock the Notifications