'యాభై శాతం ఎంపీలు వద్దన్నారు.. సామాన్యుల కోసం యుద్దం ప్రకటించా'
గోవా : నల్ల కుబేరుల ఆట కట్టిస్తా అని గత ఎన్నికల్లో చెప్పిన మాటను.. ఇప్పుడు నిలబెట్టుకున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గత మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచే దేశంలో అసలైన మార్పు ప్రారంభమైందన్నారు మోడీ. తన నిర్ణయంతో నల్లకుబేరుల సామ్రాజ్యాలు కూలిపోతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇక పెద్ద నగదు నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని యాభైశాతం ఎంపీలు వ్యతిరేకించారని.. అయినా సరే రద్దు చేయడానికే తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా సవరించడానికి చిన్న చిన్న మందులిస్తూ వస్తున్నానని.. మోడీ అంటే ఏంటో ఇప్పటినుంచి అందరికీ తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నేటి ఉదయం గోవాలో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగించిన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు గోవాలోని ఎయిర్ పోర్టును గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా మార్చే ప్రాజెక్టుతో పాటు పనాజిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రసంగంలో గోవా అభివృద్ది అంశాలతో పాటు ఎక్కువగా నల్లధనం గురించే మోడీ ప్రస్తావించారు.
దేశంలో పోగుబడ్డ నల్లధనం నిలువలను గుర్తించేందుకు నిపుణల సహాయం తీసుకుంటానన్నారు మోడీ. పెద్దనగదు నోట్ల రద్దును బ్లాక్ మనీపై సామాన్యుల తరుపున చేసిన యుద్దంగా ప్రకటించిన ఆయన.. దేశం దాటిపోయిన డబ్బును తీసుకురావాల్సి ఉందన్నారు. విదేశాల్లో నల్లకుబేరుల లావాదేవీల వివరాలు సేకరించానని.. కుర్చీ కోసం పాకులాడే వ్యక్తిని కానని మోడీ స్పష్టం చేశారు.