వర్షం, వరదలు: కాశ్మీర్లో మోడీ, ఏపీపై బాబు సమీక్ష
శ్రీనగర్/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్లో వరద పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం ఉదయం జమ్ము చేరుకున్న మోడీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఉన్నతాధికారులతో కలిసి వరద పైన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రధానికి సీఎం వివరించారు. ముంపు ప్రాంతాల్లో మోడీ పర్యటించారు.
ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ప్రత్యేక సాయంగా కేంద్రం నుండి రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్ల సాయం అందిస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. దీనిని జాతీయ విపత్తుగా మోడీ ప్రకటించారు.
కాగా వరదల కారణంగా ఇప్పటి వరకు వందలామంది జమ్ముకాశ్మీర్లో మృతి చెందారు. ఇదంతా అనుకోని ఉపద్రవమేనని, దీని నుంచి బయటపడేందుకు శాయశక్తులా శ్రమిస్తున్నామని, ఎవరు కూడా ఏ మాత్రం భయపడొద్దని, అతి త్వరలోనే వస్తున్నామని అంతకుముందు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. వరద జలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందు కోసం వైమానిక దళ హెలికాఫ్టర్లను రంగంలోకి దించమని కేంద్రాన్ని కోరామన్నారు.
ఏపీలో వర్షాలు, వరదలపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రకు పోటెత్తుతున్న వరదల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఉదయం తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు.. అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
వంశధార, నాగావళి నదుల పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
విశాఖ జిల్లాను ముంచెత్తుతున్న వర్షాలు
మూడు రోజులుగా విశాఖ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో జిల్లా పరిధిలోని వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. మారుమూల గ్రామాలకు ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెనలు వరద ధాటికి కొట్టుకుపోయాయి.
దీంతో జిల్లాలోని 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జీ మాడుగుల మండలంలో ఇద్దరు వరద నీటిలో పడి కొట్టుకుపోయినట్లు సమాచారం. మరో రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలతో రాజమండ్రి వద్ద ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్కు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో డ్యాం నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్యారేజ్ నుంచి 4.21 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ లోని నాలుగు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 40 వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వరదతో పాటు, ఎగువన ఉన్న జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో నదీ ప్రవాహం భారీగా పెరుగుతోంది.