ఏపీలో టెన్త్ మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుల ఆహ్వానం..!
ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలు (AP SSC Results 2026) తాజాగా వెలువడ్డాయి. అయితే ఈ పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్ధులకు మార్కుల రీకౌంటింగ్, జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనికి సంబందించిన తేదీలు, ఫీజులు, ఇతర వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.వి.శ్రీనివాసులు రెడ్డి ఇవాళ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
మార్చి 2026లో జరిగిన SSC (పదవ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించి, జవాబు పత్రాల రీకౌంటింగ్ (Recounting) , రీ-వెరిఫికేషన్ (Re-verification) కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం, డైరెక్టర్ డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి ఏడవ తేదీ వరకు అభ్యర్థులు తమ సంబంధిత పాఠశాల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి దరఖాస్తును సమర్పించాలని సూచించారు.

రీకౌంటింగ్ కు అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు రూ .500/-, రీ-వెరిఫికేషన్ కు ఒక సబ్జెక్టుకు ₹రూ.1,000/- చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజును కేవలం www.bse.ap.gov.in వెబ్సైట్లోని ఆన్లైన్ పేమెంట్ గేట్వే (Debit Card / Credit Card / Net Banking / UPI) ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. CFMS సిటిజన్ చలానా ద్వారా చెల్లింపులు స్వీకరించబడవన్నారు. జవాబు పత్రాల డౌన్లోడ్ సదుపాయం కల్పించామని, గత సంవత్సరాల్లో రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలు కేవలం స్కూల్ లాగిన్లో మాత్రమే అందుబాటులో ఉండేవన్నారు. అయితే, ఈ ఏడాది నుండి అదనంగా విద్యార్థుల సౌకర్యార్థం WhatsApp Governance (Mana Mitra service: 955230 0009) ద్వారా కూడా స్కాన్ చేసిన జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in సందర్శించాలన్నారు.












Click it and Unblock the Notifications