మోడీకి ఇసి షాక్: పెట్రోల్ బంకుల్లో ఫొటోలు కోడ్ ఉల్లంఘనే
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికలు జరిగే గోవాలోని పెట్రోల్ బంక్ ల వద్ద ఏర్పాటుచేసిన హోర్డింగ్ల్లో ఉత్తరాఖండ్ వాసులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సబ్సిడీ గ్యాస్ .
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికలు జరిగే గోవాలోని పెట్రోల్ బంక్ ల వద్ద ఏర్పాటుచేసిన హోర్డింగ్ల్లో ఉత్తరాఖండ్ వాసులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సబ్సిడీ గ్యాస్ వదులుకున్న వారికి సర్టిఫికెట్లు ప్రదానంచేస్తున్న ఫొటోలు ఉండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.
చర్యలు తీసుకునే బాధ్యత క్యాబినెట్ కార్యదర్శిదే
ఎన్నికల వేళ నిబంధనలు సరిగ్గా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిదేనని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి పికె సిన్హాకు లేఖ రాసింది. ఎన్నికలు జరుగనున్న గోవాలోని పెట్రోల్ బంకుల్లో ఏర్పాటుచేసిన హోర్డింగ్లలో సర్టిఫికెట్లు అందజేస్తున్న ప్రధాని ఫొటోలు ఉండటం కోడ్ ఉల్లంఘనేనని ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఇదే అంశంపై ఒక ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైందని కూడా గుర్తుచేసింది.
'ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనల కింద ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అనుమతించరానిది' అని ఆ లేఖలో తెలిపింది. ఈ నెల నాలుగో తేదీన ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. నిబంధనలు ఖచ్చితంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిదేనని తెలిపింది.
ఎస్పీ నేతల ప్రలోభాలు, బెదిరింపులు: ఇసికి బిజెపి ఫిర్యాదు
లక్నో: అధికార సమాజ్ వాదీ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నదని బిజెపి ఆరోపించింది. ఎన్నికల సంఘం తలుపు తట్టింది. ఓటర్లను ప్రలోభ పెట్టడంతోపాటు బెదిరింపులకు దిగుతూ కోడ్ ఉల్లంఘిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదుచేసింది. తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
'ఎస్పీ మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా ఓటర్లను బెదిరించడంతోపాటు ప్రలోభ పెడుతున్నారు. క్రిమినల్ నేరాలకు పాల్పడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి' అని బిజెపి యూపీ రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి చంద్రమోహన్ కోరారు. బిజెపి నాయకులు జెపిఎస్ రాథోడ్, కుల్దీప్ పాటి త్రిపాఠిలు యూపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి టి వెంకటేశ్ను కలిసి సోదాహరణంగా అధికార సమాజ్ వాదీ పార్టీ ఆగడాలను వివరించారు.
4500 చీరలు కొనుగోలుచేసిన ప్రజాపతి
ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గాయత్రి ప్రజాపతి ట్రక్కుల్లో చీరలు కొనుగోలు చేశాడన్నారు. ఇవన్నీ ఫతేపూర్ లో రెండు రోజుల క్రితం అధికారులు జప్తుచేసిన సంగతి బిజెపి నేతలు గుర్తుచేశారు. ఫతేపూర్ లోని హుస్సేన్ గంజ్ ప్రాంతంలో అమేథి నుంచి కాన్పూర్ వెళుతున్న మినీ ట్రక్కును రహదారిపై పోలీసులు తనిఖీ చేయగా 4500 చీరలు ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్ ను ప్రశ్నిస్తే ప్రజాపతి కొనుగోలు చేసినట్లు రశీదు చూపాడన్నారు.
కోడ్ ఉల్లంఘించి సోషల్ మీడియాలో ఎమ్మెల్యే సంతోష్ పాండే ప్రచారం
ఎస్పీ నేతలు, మంత్రులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఏ విధంగా బహుమతులు, చీరలు పంపిణీ చేస్తున్నారో ఈ ఒక్క ఘటనే తెలియజేస్తుందన్నారు. సుల్తాన్ పూర్ ఎస్పీ ఎమ్మెల్యే సంతోష్ పాండే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంచేస్తున్నాడన్నారు. పాండేపై పలు కేసులు కూడా నమోదయ్యాయన్నారు. చందా బజార్, లాంబౌలలో అనుమతి లేకుండా ప్రదర్శనలు జరిపారని కేసులు నమోదుచేశారని వివరించారు. అధికార యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగంచేస్తున్నారని ఆరోపించారు.
యూపీ ఎన్నికల్లో నేరుగా రంగంలోకి ఆరెస్సెస్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయావకాశాల బాధ్యతలను రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) చేపట్టింది అభ్యర్థులకు టిక్కెట్ల ఖరారు మొదలు పలు కీలక నిర్ణయాలను ఆరెస్సెస్ మాత్రమే తీసుకోనున్నది. ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీచేస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చిన పరివార్ ఇక నేరుగా బరిలోకి దిగింది. దీన్ని బట్టి యూపీ ఎన్నికలను ఆరెస్సెస్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నదో అవగతమవుతూనే ఉన్నది.
ఆరుగురు కార్యదర్శులతో ఆరెస్సెస్ టీం
ఎన్నికల బహిరంగ సభలు, ప్రజలతో ఇంటరాక్షన్ తదితర కార్యక్రమాల ఖరారు బాధ్యతను ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబాలే తన భుజస్కందాలపై వేసుకున్నారు. బిజెపి యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య కంటే ఎక్కువగా హొసాబాలే నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆరెస్సెస్ కు చెందిన ఆరుగురు కార్యదర్శుల టీంకు ఇన్ చార్జీగా బాధ్యతలు అప్పగించారు.
ఈ టీం మొత్తానికి హోసాబాలే సారథ్యం వహిస్తారు. కాన్పూర్ కు చెందిన ఓం ప్రకాశ్ శ్రీవాత్సవ, పశ్చిమ శాఖ చంద్రశేఖర్, బ్రిజ్ శాఖకు చెందిన భవానీ సింగ్, అవధ్ శాఖకు చెందిన బ్రాజ్ బహదూర్, గోరఓ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివ్ కుమార్ పాఠక్, కాశీ శాఖ నిర్వాహకులు రత్నాకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ప్రచారంపై పలు సర్వేలు
ఎన్నికల ప్రచారం నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంఘ్ పలు సర్వేలు నిర్వహించింది. పోల్ మేనేజ్ మెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలే ప్రధానంగా ఈ సర్వేలు సాగాయి. అన్ని వర్గాల వారి ఇంటర్వ్యూలు తీసుకుని మేథోమదనంచేసిన తర్వాత ఖరారుచేసే అభ్యర్థుల జాబితాను బిజెపి నాయకత్వానికి అప్పగించనున్నది. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం మినహా రాష్ట్రమంతా ఆరెస్సెస్ పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది. వారణాసి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో స్థానానికి ఇద్దరు గానీ, ముగ్గురు అభ్యర్థుల పేర్లు గానీ ప్రతిపాదించనున్నది.