క్షీణించిన వరవరరావు ఆరోగ్యం: కిడ్నీలు దెబ్బతిన్నాయా?: నానావతికి: వైసీపీ ఎమ్మెల్యే వినతికి
ముంబై: తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి, విప్లవ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు పెండ్యాల వరవర రావు ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా పరిణమించింది. ఎల్గార్ పరిషత్, భీమా-కోరేగావ్ కేసుల్లో నిందితుడిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న వరవర రావు ప్రస్తుతం ముంబైలోని ప్రఖ్యాత నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వరవర రావు నరాలు, మూత్రపిండాల సమస్యలు తలెత్తినట్లు చెబుతున్నారు. ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.
తలోజా జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడం, కరోనా వైరస్ బారిన పడటంతో మొదట ఆయనను జేజే ఆసుపత్రికి, అనంతరం సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటకపోవడంతో కొద్దిసేపటి కిందట నానావతి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య ప్రస్తుతం ఈ ఆసుపత్రిలోనే కరోనాకు చికిత్స పొందుతున్నారు.

సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరవర రావు ఈ ఉదయం మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడినట్లు జైలు అధికారులు వెల్లడించారు. న్యూరో సంబంధత సమస్యలు కూడా తలెత్తాయని చెప్పారు. ఫలితంగా మెరుగైన వైద్య చికిత్స కోసం అప్పటికప్పుడు ఆయనను నానావతి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినట్లు తెలిపారు. వరవర రావును నానావతి ఆసుపత్రికి తరలించిన విషయాన్ని సెయింట్ జార్జ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆకాశ్ ఖోబ్రాగడె ధృవీకరించారు.
ఎల్గార్ పరిషత్, భీమా-కోరేగావ్ కేసుల్లో నిందితుడిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న వరవర రావును 2018లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన విచారణ ఖైదీగా ముంబైలోని తలోజా కారాగారంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కిందటే వరవరరావు తన భార్య హేమలతతో మాట్లాడారు. వరవర రావు ఆరోగ్యం క్షీణించిందనే విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది అప్పుడే. ఆయనను కాపాడాలంటూ పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.
Recommended Video
తాజాగా- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. వరవర రావును కాపాడాలని కోరుతూ ఆయన ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. వెంకయ్య నాయుడు, వరవరరావులతో తాను జైలు జీవితాన్ని గడిపానని చెప్పుకొచ్చారు. ఆ చనువుతోనే తాను వెంకయ్య నాయుడికి లేఖ రాశానని అన్నారు. 81 సంవత్సరాల వయస్సులో వరవరరావు ప్రధాని హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆయన వయస్సు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విడుదల చేయాలని విజ్ఙప్తి చేశారు.












Click it and Unblock the Notifications