రెజ్లర్లపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు: బ్రిజ్భూషణ్ అరెస్టుకు స్వాతి మాలీవాల్ డిమాండ్
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం సమయంలో రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు తాము నిరసన చేపడుతున్న ప్రాంతం నుంచి ర్యాలీగా బయల్దేరిన విషయం తెలిసిందే.
అంతకుముందు జరిగిన పరిణామాలు గమనించినట్లయితే..
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో అటువైపు మార్చ్ చేపట్టిన రెజర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

రెజ్లర్లు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారీగా చేరుకున్న పోలీసులు రెజ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారు ఏర్పాటు చేసుకున్న టెంట్ను అక్కడ్నుంచి తొలగించారు. కాగా, రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు.
కాగా, బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అతడ్ని ఆ పదవి నుంచి తొలగించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులకుపైగా ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పూనియా తదితరులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం మహిళా సమ్మాన్ మహా పంచాయత్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు పార్లమెంట్ భవనానికి రెండు కిలోమీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, జంతర్ మంతర్ వద్ద కూడా భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

అయినప్పటికీ.. రెజ్లర్లు జాతీయ జెండాలు పట్టుకుని పార్లమెంటు వైపు మార్చ్ను చేపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించగా వినేష్ ఫొగట్, సంగీతా ఫొగట్ తదితరులను అడ్డుకున్నారు. నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు క్రీడాకారులు కిందపడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిరసనకారులందరినీ నిర్బంధించి బస్సుల్లోకి ఎక్కించినట్లు ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ దీపేంద్ర పాఠక్ వెల్లడించారు.
ఈ క్రీడాకారులు శాంతి భద్రతలను ఉల్లంఘించినందుకు గానూ తగిన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రెజ్లర్లు కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు.
VIDEO | "Those who have been stopped at borders, we request them to move forward (towards Jantar Mantar) peacefully," says wrestler Sakshi Malik. pic.twitter.com/uJWRfL3WgK
— Press Trust of India (@PTI_News) May 28, 2023
ఈ నేపథ్యంలో రెజ్లర్ల అరెస్టును ఖండిస్తూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ పట్టాషేకం అయిపోయిందని.. ఇక అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దేశానికి పతకాలు తెచ్చిన క్రీడాకారులకు కేంద్రం ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం రాత్రి అరెస్టు చేసిన రెజ్లర్లను పోలీసులు విడుదల చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అరెస్టుకు స్వాతి మాలీవాల్ డిమాండ్
రెజ్లర్లపై వేధింపులకు పాల్పడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను డిమాండ్ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్. అరెస్టు చేసిన రెజ్లర్లందరినీ వెంటనే విడుదల చేయాలన్నారు. భారత్ కు పతకాలు అందించిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు.












Click it and Unblock the Notifications