ఇన్ఫోసిస్ టెక్కీ హత్య, రెండో వీడియో రిలీజ్, కష్టమే!: తండ్రి విజ్ఞప్తి
చెన్నై: నుంగబాకం రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్న ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో పోలీసులు రెండో వీడియో ఫుటేజీని ఆదివారం నాడు విడుదల చేశారు. ఆ వీడియోలో నిందితుడు చెక్స్ క్యాజువల్ షర్ట్, జీన్ ప్యాంట్ ధరించి ఉన్నట్లుగా ఉంది.
ఈ యువకుడు స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. నుంగబక్కం రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ ఫాంలో శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు టెక్కీ స్వాతి హత్య జరిగిన విషయం తెలిసిందే.
ఫుటేజీ క్లియర్గా లేనందున..
జీఆర్పీ పోలీసులు మాట్లాడుతూ.. హత్య విషయమై ఎవరికైనా ఏదైనా తెలిసి ఉంటే వచ్చి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీసీటీవీ ఫుటేజీ నుంచి ఆధారాలు సేకరించామని, కానీ ఫుటేజీ క్లియర్గా లేనందువల్ల నిందితుడి స్కెచ్ వేయడం కష్టతరంగా మారిందని సీనియర్ అధికారులు చెప్పారు.
చెన్నై పోలీసుల సహకారం
ఈ హత్య కేసు విచారణలో చెన్నై పోలీసులు జీఆర్పీ పోలీసులకు సహకరిస్తున్నారు. చెన్నై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ... జీఆర్పీ పోలీసుల విజ్ఞప్తి మేరకు స్థానిక నగర పోలీసులు విచారణలో సహకరిస్తున్నారని చెప్పారు. నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా, స్వాతిని హత్య చేసింది కిరాయి హంతకుడా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రజల సమక్షంలో పెద్ద కత్తితో వచ్చి హత్య చేసే దుస్సాహసానికి కిరాయి హంతకులు పాల్పడుతుంటారని భావిస్తున్నారు. ఆ యువకుడు స్కూల్ బ్యాగు తగిలించుకొని ఆవేశంగా వెళ్లడాన్ని గురించి ఆరా తీస్తున్నారు.

నా కూతురు ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు: తండ్రి
తన కూతురు క్యారెక్టర్ గురించి అనుచితంగా వార్తలు వస్తున్నాయని, అది సరికాదని హతురాలు స్వాతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురును వివాదంలోకి లాగవద్దని హితవు అభిప్రాయపడ్డారు. నా కూతురు ప్రాణాలు ఎలాగు తీసుకురాలేమని, కనీసం ఆమె పరువును తీయవద్దన్నారు. స్వాతి మృతి పైన వివిధ రకాల వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో..
స్వాతి మృతి పైన సోషల్ మీడియా కన్నీరు కారుస్తోంది! స్వాతి ఓ విధంగా క్షోభించిందో ఊహిస్తూ రాశారు. 'అందరి యువతుల్లాగే నేను జీవితంపై కలలు గన్నాను. అవేమీ పెద్ద కలలు కావు. మంచి ఉద్యోగం మంచి కుటుంబంతో హాయిగా జీవించాలని ఆసించాను. నాపై అలాంటి ఆశలే పెట్టుకున్న మా నాన్న ఆఫీసుకు బయలుదేరి నన్ను ఎప్పటిలాగే స్టేషన్ వద్ద డ్రాప్ చేశాడు.
అదే అదను కోసం చూసిన ఓ యువకుడు ఒంటరిని చేసి తగువులాడాడు. అతని నుంచి దూరంగా వెళ్లిపోతున్న తనను వెంటాడి నరికాడు. నా పట్ల రాక్షసుడిలా వ్యవహరించటాడు. అతడి ఆగడాలను రైల్వే ప్లాట్ ఫాం పైన ఉన్న ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు. కత్తితో నరికి వేస్తున్నా ఒక్క మగాడు కూడా వచ్చి అడ్డుకోలేదు. పైగా హత్యాకాండను తిలకించారు.
ఈ రోజు నేను చనిపోయాను. రెండు మూడు రోజుల్లో నా గురించి మరిచిపోతారు. ఏదో ఓ రోజు ఆ యువకుడిని పట్టుకుంటారు. అతను నాపై కోర్టులో ఏవో తప్పులు చెబుతాడు. అతను చెప్పేవి అవాస్తవాలు అని వాదించేందుకు నేను లేను. ప్లాట్ ఫాం పైన జరిగిన హత్యకు సమాజం తలదించుకోవాలి, ఇప్పటికైనా మారాలి' అని సోషల్ మీడియాలో స్వాతి ఆత్మ క్షోభించినట్లుగా రాశారు.












Click it and Unblock the Notifications