యూపీలో ఐదో విడత పోలింగ్ ప్రారంభం: 61 స్థానాలు- బరిలో 692 మంది : అయోధ్యలో సైతం..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ లో అయిదో విడత పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికలు ఈ విడత పోలింగ్ తో కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పూర్తయిన నాలుగు విడతల ఎన్నికల పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడు - నాలుగో విడత పోలింగ్ పైన పార్టీల్లోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక, ఈ రోజు 12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Recommended Video
అయోధ్యతో సహా కంచుకోటల్లో
యూపీలోని కీలకంగా భావించే రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో సైతం పోలింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ కంచు కోటలుగా చెప్పుకొనే అమేఠీ, రాయ్బరేలీ జిల్లాల్లోనూ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో కీలకమైన సుల్తాన్పుర్, చిత్రకూట్, ప్రతాప్గఢ్, కౌశాంబి, ప్రయాగ్రాజ్, బారాబంకి, బహ్రయిచ్, శ్రావస్తి, గోండా జిల్లాల్లో ఈ దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులు తమ భవిష్యత్ ను పరీక్షించుకుంటున్నారు. వారిలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సిరతు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు.
బరిలో పలువురు ప్రముఖులు
ఆయనపై అప్నాదళ్ నేత పల్లవి పటేల్ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సిద్ధార్థ నాథ్ సింగ్ (అలహాబాద్ పశ్చిమం), రాజేంద్ర సింగ్(ప్రతాప్గఢ్), నంద గోపాల్ గుప్తా నాడి (అలహాబాద్ దక్షిణం), రమాపతి శాస్త్రి (మంకాపుర్), 1993 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న రఘురాజ్ ప్రతాప్ సింగ్ మరోమారు కుండా నుంచి పోటీలో నిలిచారు.
మరోవైపు.. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత ఆరాధన మిశ్రా పోటీలో ఉన్నారు. ఈ రోజు అయిదో విడతలో భాగంగా జరుగుతున్న ఎన్నికలతో రాష్ట్రంలో మొత్తంగా 292 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. వచ్చే నెల మార్చి 3, 7 తేదీల్లో ఆరు, ఏడవ విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న మొత్తం అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఆ రెండు పార్టీల మధ్య హోరా హోరీగా
2024 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కీలకంగా మారాయి. అధికారం నిలబెట్టుకొనేందుకు తొలి నుంచి యూపీ పైన బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీ సమాజ్ వాదీతో తలపడుతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.
ఎస్పీ అధినేత అఖిలేష్ సైతం బీజేపీ పైన పదునైన విమర్శలతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ... సీఎం యోగీ పూర్తిగా యూపీ గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. మరో రెండు విడతల పోలింగ్ మిగిలి ఉండటంతో.. ఈ రోజు జరుగుతున్న పోలింగ్ పైన ఫోకస్ పెడుతూనే..మిగిలిన రెండు విడతల పోలింగ్ సాగే నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పార్టీల నేతలు కొనసాగిస్తున్నారు.