ఫన్ బేస్డ్: లెర్న్ టు రీడ్.. రీడ్ టు లెర్న్: 3వ క్లాస్లోనే ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ: సిలబస్ కుదింపు
న్యూఢిల్లీ: జాతీయ నూతన విద్యావిధానం కింద ఎర్లీ ఛైల్డ్ హుడ్ కేర్ విద్యావిధానాన్ని తాము అమలు చేయబోతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ప్రీ స్కూల్ విద్యను మారుమూల గ్రామాలకు చేరవేస్తున్నామని చెప్పారు. జాతీయ విద్యావిధానం ద్వారా ఫౌండేషన్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. లెర్న్ టు రీడ్.. రీడ్ టు లెర్న్ అనే లక్ష్యంగా తాము ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థి కూడా మూడో తరగతి చదువును పూర్తి చేసుకునే ప్రతి విద్యార్థీ.. ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీని అభ్యసించేలా చేస్తామని అన్నారు. సిలబస్ తగ్గిస్తున్నామని అన్నారు.
నాలుగు గోడల మధ్య విద్యకు బ్రేక్
అలాంటి విద్యార్థి.. భవిష్యత్తులో పాఠ్యాంశాలను త్వరితగతిన అభ్యసించగలరని చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన జాతీయ విద్యావిధానంపై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. బేసిక్ గణితాన్ని నేర్పించడానికి ప్రాధాన్యత ఇస్తామనీ అన్నారు. నాలుగు గోడల మధ్య విద్యాను అభ్యసించే విధానానికి కాలం చెల్లిందని మోడీ చెప్పారు. నాలుగు గోడల నుంచి బయటికి వచ్చి.. బాహ్య ప్రపంచంలో చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దీనికి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ బాల్యాన్ని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మైలురాళ్లను ఆధారంగా చేసుకుని ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ అంకెలను నేర్చుకున్నారని చెప్పారు.
జపాన్లో అత్యుత్తమ విధానం..
జపాన్లో షిన్రిన్ యోకో అనే విధానాన్ని అనుసరిస్తున్నారని మోడీ తెలిపారు. అడవులు, పర్యావరణం మధ్య జపాన్లో విద్యార్థులకు చదువును బోధిస్తున్నారని నరేంద్ర మోడీ చెప్పారు. దీనివల్ల పిల్లల్లో బాల్యం నుంచే పర్యావరణం పట్ల మక్కువ పెరుగుతుందని, పిల్లల్లో సృజనాత్మకతా మెరుగుపడుతుందని అన్నారు. ప్రకృతి ఒకరకమైన అనుబంధం ఏర్పడుతుందని మోడీ తెలిపారు. ప్రతి అంశాన్ని విభిన్న దృష్టితో తిలకించాల్సిన అవసరం ఉందని, దీన్ని బాల్యం నుంచి పెంపొందించేలా చర్యలు చేపట్టామని అన్నారు. జాతీయ విద్యావిధానంలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
Recommended Video
బాల్యమే కీలకం..
తరగతి గదిలో రైలింజన్ గురించి బోధించడం కంటే.. పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కు వెళ్లి దాని గురించి ప్రాక్టికల్గా అద్భుత ఫలితాలు ఇస్తుందని, దీన్ని తాను బలంగా విశ్వసిస్తున్నానని మోడీ చెప్పారు. చాలామంది ఉపాధ్యాయులు పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేస్తున్నారని, అన్ని చోట్లా అలా ఉండట్లేదని అన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జికి విద్యార్థులు దూరమౌతున్నారని, ఆ కొరతను తీర్చబోతున్నామని చెప్పారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే.. బాల్యంలో అందించే చదువే కీలకంగా మారుతుందని, దాన్ని మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు.