ఈ మధ్యాహ్నమే NEET Re-exam కోసం ఏకంగా.. !!
దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్కు జాతీయ పరీక్షల సంస్థ (NTA) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం జరగనున్న ఈ పరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాబోయే ఈ రీఎగ్జామ్కు దేశ విదేశాల నుంచి రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరవుతున్నారు.
దేశవ్యాప్తంగా 551 నగరాలతో పాటు విదేశాల్లో మరో 14 నగరాల్లో పెన్ అండ్ పేపర్ (ఆఫ్లైన్) విధానంలో ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష జరగనుంది. మొత్తం 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి పరీక్ష రాయనున్నారు. పేపర్ లీక్ వంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు ఎన్టీఏ అధికారులు. ఈ మధ్యాహ్నం మాక్ డ్రిల్ ఆరంభమౌతుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రత్యేక అర్హత కలిగి, అదనపు సమయం పొందేందుకు దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వేర్వేరు విభాగాలు రంగంలోకి దిగాయి. జిల్లా యంత్రాంగాలు, స్థానిక పోలీసు బలగాలు, ప్రత్యేక నిఘా బృందాలతో ఎన్టీఏ అధికారులు సమన్వయం చేసుకొంటున్నారు.
ప్రశ్నాపత్రాలు, ఇతర పరీక్షలకు సంబంధించిన డాక్యుమెంట్లను భద్రంగా తరలించేందుకు గట్టి ఎస్కార్ట్ భద్రతను ఏర్పాటు చేశారు. పరీక్షను శాంతియుతంగా జరిపేందుకు పోలీసులు, జిల్లా అధికారులు సహా దాదాపు రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని ఎన్టీఏ నియమించింది. పరీక్ష కేంద్రాల పరిధిలో తనిఖీలను పటిష్టంగా అమలు చేసేందుకు ఉన్నత స్థాయి యంత్రాంగం అందుబాటులో ఉంది.
దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు 674 మంది సిటీ కోఆర్డినేటర్లను కేటాయించారు. వీరితో పాటు పరీక్షా విధులను నిరంతరం నిష్పక్షపాతంగా పర్యవేక్షించేందుకు 6,669 మంది స్వతంత్ర అబ్జర్వర్లను పరీక్షా కేంద్రాల నిఘా కోసం క్షేత్రస్థాయిలోకి పంపారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ప్రత్యేకంగా సెంటర్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను కూడా సమర్థులైన వారిని నియమించినట్లు అధికారులు వివరించారు.
వివిధ ప్రభుత్వ సంస్థలు, స్థానిక జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో నిరంతర సమీక్షలు జరుగుతున్నాయి. మాక్ డ్రిల్ సమయంలో ప్రతి ఒక్క సిబ్బంది వారికి కేటాయించిన సీటింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సెక్యూరిటీ చెకింగ్ విధానాలను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. తద్వారా రీటెస్ట్ రోజున విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అవకాశం లభిస్తుంది. గతంలో పరీక్షల నిర్వహణలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు ఇతర గందరగోళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications