కరోనాపై యుద్ధంలో మన అస్త్రాలు అవే: లెమన్ గ్రాస్.. డ్రాగన్ ఫ్రూట్: వాజ్పేయి మాటలతో: మోడీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. సరిహద్దుల్లో శతృదేశాలను సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్న తరహాలోనే దేశ ప్రజలు కరోనాపై యుద్ధం చేస్తున్నారని అన్నారు. ఆదివారం ఆయన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది 67 వ మన్ కీ బాత్ కార్యక్రమం. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను మోడీ వినిపించారు.
మాస్కుల ధారణ, పరిసరాల పరిశుభ్రత..
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కొన్ని నెలలుగా దేశం మొత్తం కరోనాపై యుద్ధం చేస్తోందని అన్నారు. రికవరీ రేటు మిగిలిన దేశాలతో అధికంగా ఉందని అన్నారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడటంలో విజయం సాధించామని అన్నారు. చాలా చోట్ల వైరస్ వేగంగా విస్తరిస్తోందని అన్నారు. కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమేనని చెప్పారు. ఈ వైరస్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాస్కుల ధారణ, పరిసరాల శుభ్రత, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలే కరోనాపై పోరాటంలో ఆయుధాలుగా వినియోగిస్తున్నామని అన్నారు.
మాస్కులు ఇబ్బంది కలిగించినా..
చాలామంది మాట్లాడేటప్పుడు తమ ముఖంపై నుంచి మాస్కులను తొలగిస్తున్నారని, అది సరికాదని చెప్పారు. డాక్టర్లు గంటల పాటు ముఖానికి మాస్కులు, పీపీఈ కిట్లను ధరించి రోగులకు సేవలను అందిస్తున్నారని గుర్తు చేశారు. మాస్కుల వల్ల ఇబ్బందులు ఎదురైన సమయంలో డాక్టర్ల సేవలు, వారుపడుతున్న కష్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి జమ్మూకాశ్మీర్కు చెందిన సర్పంచ్ సహా మహిళా రైతు చేసిన కృషిని గుర్తు చేశారు. బిహార్, మణిపూర్, మిజోరం వంటి రాష్ట్రాల ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక చర్యలను చేపట్టారని అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్..
జార్ఖండ్లో కొందరు రైతులు లెమన గ్రాస్ను అభివృద్ధి చేశారని అన్నారు. కొంతమంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ను అభివృద్ధి చేశారని, వాటిని రోగ నిరోధక శక్తిగా పెంపొందించుకోవచ్చని అన్నారు. గుజరాత్లోని లేహ్ సహా లఢక్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి అవసరమైన కొత్త కొత్త ఆహార పదార్థాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కింద వారంతా తమ వినూత్న ప్రయోగాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయకపోవడమే భారతీయుల నైజమని, దాన్ని వారు నిరూపిస్తున్నారని అన్నారు.
Recommended Video
సీజనల్ వ్యాధుల పట్ల..
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ సూచించారు. ఒకవైపు కరోనా వైరస్..మరోవైపు సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయని గుర్తు చేశారు. ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకోవాలని సూచించారు. ఎలాంటి అనారోగ్యానికి గురైనా భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పారు. సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి వైద్యపరమైన సూచలను తీసుకోవాలని అన్నారు. బిహార్, అస్సాం వంటి రాష్ట్రాలను వరదలు ముంచెత్తతున్నాయని, అక్కడి ప్రజలకు నైతిక ధైర్యాన్ని అందించాలని మోడీ దేశ ప్రజలకు సూచించారు.