ఉగ్రదాడి: పఠాన్ కోట్ లో ప్రధాని మోడీ
పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారులతో కలిసి ఉగ్రదాడి జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చేరుకున్నారు.
ఇటీవల ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి ఘటనను ఆర్మీ ఉన్నతాధికారులు నరేంద్ర మోడీకి వివరించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను మోడీ క్షుణ్ణంగా పరిశీలించారు. పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఆరు మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే.
ఇదే సందర్బంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆర్మీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.
ఈ సమావేశంలో ఉగ్రవాదాన్ని ఏలా అంతం చెయ్యాలి అనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆర్మీ అధికారులతో చర్చించారని తెలిసింది. ప్రధాని పర్యటన సందర్బంగా పఠాన్ కోట్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.