రేపే.. లోక్ సభ ముందుకు: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ.. కేంద్రం తాజా వ్యూహం
దేశంలో పేపర్ లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి ముచ్చెమటలు పట్టించేలా కఠిన శిక్షలు విధించడానికి రూపొందించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026 ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ఈ సవరణ బిల్లును లోక్సభ ముందుకు తీసుకురానున్నారు. ఈ మేరకు ఈ బిల్లు ముసాయిదాను ఎంపీలకు కూడా పంపిణీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2024 నాటి చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ నూతన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.

దేశవ్యాప్తంగా ఇటీవల వెలుగుచూసిన వివిధ పోటీ పరీక్షల పేపర్ లీకేజీ ఉదంతాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో లక్షలాదిమంది విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరసనలు చేపట్టడం, వారి డిమాండ్లకు అనుగుణంగా ఈ సవరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ చర్యలను వేగవంతం చేసింది.
ఈ సవరణ బిల్లు ప్రకారం.. పరీక్షల్లో అక్రమాలకు లేదా మాల్ ప్రాక్టీస్ లకు పాల్పడే వ్యక్తులకు విధించే జైలు శిక్షను అయిదు నుంచి పదేళ్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఈ శిక్ష మూడేళ్ల నుంచి అయిదేళ్లుగా మాత్రమే. దీంతో పాటు వ్యక్తిగతంగా విధించే గరిష్ఠ జరిమానా పరిమితిని కూడా రూ. 10 లక్షల నుండి ఏకంగా రూ. 50 లక్షల వరకు పెంచడం ద్వారా పరీక్షల మాఫియాపై ఉక్కుపాదం మోపనున్నారు.
పరీక్షలను నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కూడా కఠిన చర్యలు ప్రతిపాదించింది కేంద్రం. పరీక్షలను సక్రమంగా నిర్వహణలో విఫలమైతే విధించే గరిష్ఠ జరిమానాను రూ. కోటి నుంచి అయిదు కోట్ల రూపాయలకు పెంచింది. పరీక్షల నిర్వహణ నుండి సంబంధిత ప్రైవేటు ఏజెన్సీలు లేదా అనుబంధ సంస్థలను నిషేధించే బ్లాక్లిస్ట్ కాలాన్ని నాలుగు నుండి ఎనిమిది సంవత్సరాలకు రెట్టింపు చేసింది.
ఈ సంస్థలకు చెందిన డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పులకు పాల్పడితే వారికి కనీస జైలు శిక్షను మూడేళ్ల నుంచి అయిదేళ్లకు పెంచారు. వీరికి విధించే వ్యక్తిగత జరిమానాను కూడా రూ. కోటి నుండి అయిదు కోట్ల రూపాయల వరకు పెంచుతున్నారు. ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడే ముఠాలకు కనీస శిక్షను ఏడేళ్లకు పెంచడం, జరిమానాను రూ. 10 కోట్లుగా ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications