గాజు గ్లాస్ గుర్తుపై పోటీ: యానాం స్వతంత్ర అభ్యర్థి మిస్సింగ్: అసెంబ్లీ ఎన్నికల వేళ..కలకలం
పాండిచ్చేరి: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ కలకలం చెలరేగింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్నపెమ్మాడి దుర్గా ప్రసాద్ అదృశ్యం అయ్యారు. గురువారం ఉదయం నుంచీ ఆయన ఆచూకీ తెలియకుండా పోయారు. తన భర్త కనిపించట్లేదంటూ ఆయన భార్య పెమ్మాడి శాంతి యానాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయం 6 గంటలకు కొత్తపేట అన్యం గార్డెన్స్లోని శ్రీనివాస అపార్ట్మెంట్లోని నివాసం నుంచి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారని, అప్పటి నుంచి ఆయన మొబైల్ ఫోన్ స్విచాఫ్లో ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెమ్మాడి దుర్గా ప్రసాద్.. మత్స్య వ్యాపారి. ఆయనకు సొంతంగా ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. యానాం కొత్తపేటలో ఆయన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల గుర్తు.. గ్లాసు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. యానాం మత్స్యకార కుటుంబాల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకుపై గట్టి పట్టు ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.
ఇందులో భాగంగా- గురువారం ఉదయం తన నివాసం నుంచి బయటికి వెళ్లిన ఆయన ఆచూకీ తెలియకుండా పోయారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పటి నుంచీ ఆయన మొబైల్ ఫోన్ స్విచాఫ్లో ఉన్నట్లు ఆయన భార్య శాంతి చెబుతున్నారు. పరిచయస్తుల కుటుంబాల్లో ఆరా తీసినప్పటికీ.. వారెవరు కూడా తమకు తెలియదంటూ బదులిచ్చారు. దీనితో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఆయన కోసం గాలిస్తున్నారు. మొబైల్ సిగ్నల్ టవర్ల ఆధారంగా ఆయన ఎక్కడున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు.