పుల్వామా ఉగ్రదాడి: బిగ్గెస్ట్ ఇంటెలిజెన్స్ డిజాస్టర్? 350 కేజీల ఐఈడీని ఎలా సమకూర్చుకున్నారు?

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా జాతీయ రహదారిపై జైషె మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడి.. అతిపెద్ద నిఘా వైఫల్యంగా పరిగణిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అత్యంత సున్నితమైన రాష్ట్రమనే విషయం తెలిసనప్పటికీ, ఉగ్రవాదుల కార్యకలాపాలు మితిమీరినట్లు తెలిసినప్పటికీ.. నిఘా విభాగం గానీ, జాతీయ భద్రత ఏజెన్సీ గానీ ఏం చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ రహదారి మీద, 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్ పై పట్టపగలు ఉగ్రవాదులు దాడులు చేయాల్సిన పరిస్థితి ఎలా ఉత్పన్నమైందనే సందేహాలు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా ఉగ్రవాదులు నిద్రాణంగా ఉన్న నేపథ్యంలో.. ఒక్కసారిగా విరుచుకుపడే ప్రమాదం ఉందని అంటూ నివేదికలు వచ్చిన తరువాత కూడా పట్టించుకోలేదనే విమర్శలకు తావిచ్చినట్టయింది.

ఐఈడీ ద్వారా దాడి సంభవించే అవకాశాలు ఉన్నట్లు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బి, వైమానిక దళానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ నెల 8వ తేదీ నాడే అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు దాడి చేయొచ్చనే విషయంపై తమకు ముందే సమాచారం ఉందని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మలిక్ కూడా ప్రస్తావించారు. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సమగ్రంగా అంచనా వేయలేకపోయాయని చెప్పారు. ఈ విషయంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందని స్వయంగా గవర్నరే చెప్పడం వైఫల్యం తీవ్రతను చెబుతోంది.

Pulwama Terror Attack: biggest intelligence disaster ever says experts

నిజానికి- ఉగ్రవాదులను ఏరివేయడానికి సైన్యం కొద్దిరోజుల కిందట ఆపరేషన్ ఆల్ అవుట్ను చేపట్టింది. కాశ్మీర్ ను లక్ష్యంగా చేసుకుని రోజువారీ కార్డన్ అండ్ సెర్చ్ లో భాగంగా సైన్యం ఈ ఆపరేషన్స్ చేపట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇంటింటినీ తనిఖీ చేశారు జవాన్లు. దీనిపై విమర్శలు వచ్చాయి. అకారణంగా మైనారిటీ యువతను టార్గెట్ గా చేసుకుని, ఉగ్రవాదుల పేరుతో వారిని కాల్చి చంపుతున్నారంటూ జమ్మూ కాశ్మీర్ లో ఆరోపణలు వర్షం కురిసింది. దీనితో సైన్యం ఈ ఆపరేషన్ నుంచి వెనక్కి తగ్గింది. దీని స్థానంలో రోజువారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని గవర్నర్ సూచించారు.

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ సందర్భంగా.. జమ్మూ కాశ్మీర్ లో కనీసం 258 మంది ఉగ్రవాదులు తలదాచుకుని ఉండొచ్చంటూ ఆ రాష్ట్ర పోలీసులు నివేదిక ఇచ్చారు. వివిధ సందర్భాల్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో కనీసం 230 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. అయినప్పటికీ.. జమ్మూ కాశ్మీర్ లో ఇంత భారీ ఎత్తున ఉగ్రదాడి చోటు చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. 78 వాహనాల్లో 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్ పై దాడి చేసేంత శక్తిమంతులు ఎలా అయ్యారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. దాడి కోసం ఉగ్రవాదులు ఏకంగా 350 కేజీల పేలుడు పదార్థాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? ఎలా సేకరించారు? ఇందులో స్థానికుల సహకారం ఉందా? అనే విషయాలపై ఆరా తీయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉగ్రదాడికి కేంద్రబిందువైన అదిల్ అహ్మద్ దార్.. స్థానికుడు. ఏడాది కిందటే ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ లో చేరారు. క్రియాశీలకంగా ఉన్న అతి పెద్ద ఉగ్రవాద సంస్థలో స్థానికుడైన అదిల్ అహ్మద్ చేరితే.. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి? అనే ప్రశ్నకు సమాధానం ఎవరు ఇస్తారనేది వేచి చూడాల్సిందే. కాశ్మీర్ దక్షిణ ప్రాంతంలోని పుల్వామా జిల్లా గుండీబాగ్ కు చెందిన అదిల్ అహ్మద్ కు స్థానికంగా కమాండో ఆఫ్ గుండీబాగ్ అనే పేరుంది. చదువును మధ్యలోనే ఆపేసిన అనంతరం కొద్దిరోజుల పాటు అతను ఎవరికీ కనిపించకుండా పోయాడు. అతని గురించి ఆరా తీయడంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

ఆయా ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రత్యేకంగా జాతీయ భద్రతా ఏజెన్సీని ఏర్పాటు చేసినప్పటికీ.. జమ్మూ కాశ్మీర్ లో తరచూ ఉగ్రదాడులు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి. వాటన్నింటినీ మించి.. 350 కేజీల ఐఈడీతో ఉగ్రవాదులు దాడులకు తెగబడటం, 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలను కోల్పోవటం.. అతి పెద్ద నిఘా వైఫల్యంగా భావిస్తున్నారు. దాడి చోటు చేసుకున్న తరువాత జాతీయ భద్రత సంస్థ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉందని ప్రతిపక్షాలు అప్పుడే తమ విమర్శలకు పదును పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+