కెప్టెన్ చీల్చే ఓట్లు ఎవరివి- మహిళా ఓట్లు ఆప్ వైపేనా : పంజాబ్ లో మారుతున్న సమీకరణాలు..!!
పంజాబ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ సారి ఆప్ ఇక్కడ మహిళా ఓటర్ల మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ ఎవరి ఓట్ బ్యాంకు ను చీలుస్తారనేది మరో ఆసక్తి కర ఈక్వేషన్ గా మారుతోంది. పంజాబ్ లో ఎలాగైనా పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్కడ మహిళా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.
మహిళలకు ఆప్ వరాలు
పంజాబ్లో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రంలోని ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలలో రూ.1,000 జమ చేస్తుందని ప్రకటించారు. "సమాజంలో సుస్థిరతను నిర్ధారించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తరుఫున ఆర్థిక సహాయం చేయడానికి ఆప్ హామీ ఇస్తుందన్నారు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలందరికీ నెలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది" అని కేజ్రీవాల్ ప్రకటించారు. మోగా నుంచి కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించి.. లూధియానాకు వెళ్లారు.
ప్రచారంలో ముందున్న కేజ్రీవాల్
2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని సాధించింది. 10 సంవత్సరాల తర్వాత SAD-BJP ప్రభుత్వాన్ని గద్దె దించింది. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లకే పరిమితమైంది. కాగా, మిషన్ పంజాబ్' కింద, కేజ్రీవాల్ వచ్చే తమ సీట్లను పెంచుకోవటంతో పాటుగా అధికారం దక్కించుకొనే వ్యూహాలను అమలు చేస్తున్నారు.
అమరీందర్ పాత్ర ఎలా ఉంటుంది
ఇక, పంజాబ్ లో ఈసారి మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలకంగా మారుతున్నారు. ఆయన కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని సన్నిహితులు చెబుతున్నారు. పంజాబ్లో తమ కుటుంబానికి కంచుకోటలాంటి పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేయనున్నారు. తన ఫేస్బుక్ పేజ్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పాటియాలా నుంచే తాను పోటీ చేస్తానంటూ ఆయన స్పష్టంచేశారు. తమ కుటుంబానికి పాటియాలాతో 400 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు.
పాటియాలా నుంచే అమరీందర్ పోటీ
సిద్ధూ కారణంగా ఈ బంధాన్ని తెంచుకుని మరోచోటికి వెళ్లబోనని స్పష్టంచేశారు. అమరీందర్ సింగ్ కుటుంబానికి తొలి నుంచి పాటియాలా కంచుకోటలా ఉంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ 4 సార్లు (2002, 2007, 2012, 2017) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అమృతసర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికకావడంతో 2014లో అమరీందర్ సింగ్ పాటియాలా అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆయన సతీమణి ప్రణీత్ కౌర్ పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆమె మూడుసార్లు ప్రాతినిధ్యంవహించారు.
Recommended Video
కాంగ్రెస్ ప్రచార సారధి ఎవరు
పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతే కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్న అమరీందర్ సింగ్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ చీలికవర్గంతో వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఉండే అవకాశముందని ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. పొత్తు సాధ్యంకాని పక్షంలో అన్ని స్థానాల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని ప్రకటించారు. 2022 ఎన్నికల్లో సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా.. తాము బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి ఓడిస్తామంటూ అమరీందర్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు.