పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు: ఆ 45 స్థానాలపైనే ప్రత్యేక దృష్టి, ఎందుకంటే?
ఛండీగఢ్: వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. సుమారు 20 ఏళ్ల నుంచి శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)తో కొనసాగిన పొత్తు ఇటీవల తెంచుకున్న విషయం తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చింది. ఈ క్రమంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనుంది.
Panneerselvam భార్య మృతి: తమిళనాడు కీలక నేతల పరామర్శ (ఫొటోలు)
2022లో జగరనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో హిందువులు మెజార్టీలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ దృష్టి సారిస్తోంది. హిందువులు మెజార్టీగా ఉన్న మొత్తం 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

60 శాతానికిపైగా హిందువులు ఉన్న నియోజకవర్గాలను గుర్తించి ఆ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల పార్టీ నేతలకు మార్గనిర్దేశనం కూడా చేసినట్లు సమాచారం. ఈ 45 నియోజకవర్గాల్లోనే 23 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో ఎస్ఏడీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది.
గత కొంత కాలంగా బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలోని పలు చోట్ల దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లోనే ఎక్కువగా దృష్టి సారిస్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. వీటితోపాటు ఇతర స్థానాల్లోనూ గెలిచేందుకు భారీ కసరత్తులు చేయాల్సి ఉందన్నారు.
రోపర్, జలాలాబాద్, పాటియాలా(అర్బన్), బఠిండ(అర్బన్) స్థానాలను బీజేపీ తిరిగి దక్కించుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీకి మంచి పట్టున్న దేరబస్సి, ఖరార్, మోహాలీ, రోపర్, బుద్ధలాడ, బఠిండ(అర్బన్) నియోజకవ్గాలతోపాటు ఇతర నియోజకవర్గాలపైనా దృష్టి సారించాలని రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
కాగా, పంజాబ్ బీజేపీ జనరల్ సెక్రటరీ సుభాష్ శర్మ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుండటం బీజేపీకి ఒక భిన్నమైన అనుభవమని వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్ రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే అవకాశం తక్కువేనని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications