తమిళనాడు ఎన్నికల వేళ రాహుల్ యూట్యూబ్ హంగామా- పుట్టగొడుగుల బిర్యానీ తింటూ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలకు చెందిన నేతలు కూడా తమిళనాడును చుట్టేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా తమిళనాడుకు వెళ్లడమే కాకుండా అక్కడ స్ధానికంగా ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్లో పుట్టగొడుగుల బిర్యానీ తింటున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తమిళనాడులో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సందడి చేస్తున్నారు. పొరుగున ఉన్న కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ ఇప్పుడు స్ధానిక సెంటిమెంట్తో తమిళనాడులో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో స్ధానికులతో కలిసి ఆయన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి తమిళనాట కాస్తో కూస్తో ఆదరణ ఉండటం కూడా రాహుల్ గాంధీకి ఇప్పుడు కలిసివస్తోంది.
యూట్యూబ్ ఛానల్లో పుట్టగొడుగుల బిర్యానీ తింటూ
గతవారం తమిళనాడులో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్ గాంధీ స్ధానికంగా ఉన్న విలేజ్ కుకింగ్ ఛానల్ పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ పేజ్కు వెళ్లారు. అక్కడ పుట్టగొడుగుల తయారీని పరిశీలించిన రాహుల్.. ఛెఫ్లతో కలిసి బిర్యానీ కూడా తిన్నారు. బ్లూ టీ షర్డ్ వేసుకున తమిళ బాషలో వణక్కం అంటూ రాహుల్ పలకరించిన తీరు, బిర్యానీ తింటూ వేసిన చెణుకులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్ధానికులతో రాహుల్ కలిసిపోయిన విధానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఛెప్లతో కలిసి రైతా తయారు చేసిన రాహుల్
14 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాహుల్ గాంధీ పుట్టగొడుగుల బిర్యానీ తయారు చేస్తున్న ఛెఫ్లకు సహకరించడమే కాకుండా వారితో కలిసి రైతా (పెరుగు పులుసు) కూడా తయారు చేశారు. తమిళనాడులోని కరూర్ ఎంపీ, మహిళా నేత జ్యోతిమణితో పాటు మరో ఇద్దరు పార్టీ నేతలు కూడా ఈ వీడియోలో రాహుల్తో కలిసి ఛెఫ్లతో ముచ్చటిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో పాటు రాహుల్ పుట్టగొడుగుల సేకరణ, బిర్యానీ వంటకం గురించి ఛెఫ్లను ఆడిగి తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. స్ధానిక అహారపు అలవాట్ల గురించి రాహుల్ వారిని వాకబు చేశారు.
రాహుల్కు ధన్యవాదాలు తెలిపిన ఛెప్లు
ఈ వీడియోలో ఆద్యంతం పుట్టగొడుగుల తయారీలో తమతో కలిసి ఉండి, సహకరించిన రాహుల్ గాంధీకి ఛెఫ్లు ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ వంటి జాతీయ స్ధాయి నేత తమను కలుసుకున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. వారి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్... మరోసారి వారిని కలుస్తానని హామీ ఇచ్చారు. రాహుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతుండగా..అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు ఛెఫ్లకూ, ఆయనకూ మధ్య సంధానకర్తలుగా వ్యవహరించారు.