కర్ణాటకలో అధికారంపై కాంగ్రెస్ గురి.. టార్గెట్ 150..!! : నేతలకు రాహుల్ దిశా నిర్దేశం
కర్ణాటకలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. సరిగ్గా మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీ నేతలు, శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. పేదల హక్కులను కాలరాసి పామిశ్రామికవేత్తలకు కట్టబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు.

కర్ణాటకలో అధికారంపై రాహుల్ దృష్టి
దేశంలో ఏ బీజేపీ నాయకుడు కూడా ఈరోజు ఉపాధి, ఆర్థిక వ్యవస్థ, అవినీతి గురించి మాట్లాడడం లేదని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీల్లో కనీసం 150 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేయాలని నిర్దేశించారు. పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని అప్పుడే విజయం సొంతమవుతుందని పిలుపునిచ్చారు.
టార్గెట్ 150 సీట్లుత
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మేలో జరగనున్నాయి. 224 స్థానాలున్న ఈ శాసన సభ ఎన్నికల్లో 150 స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ సూచించారు. ఇది మనమంతా ఐక్యమత్యంగా పోరాడితేనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక కంచుకోట. బడుగు, బలహీన వర్గాలకు వెన్నంటి ఉండేది కాంగ్రెస్ పార్టీయే అని ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. పార్టీ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే , ఇతరనేతలు కలిసి కట్టుగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్దేశించారు.
మహిళలు, యువతకు పెద్దపీట
వచ్చే ఎన్నికల్లో యువత , మహిళలను పెద్ద పీట వేయనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. ఉద్యోగాలను సృష్టించే స్థితిలో లేదన్నారు. ప్రదాని మోదీ అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని దయ్యబట్టారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పార్టీలో వర్గ విభేదాలకు తావులేదని.. కలసి కట్టుగా అధికారం కోసం పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications