కేసీఆర్ మాయమాటలు: వీహెచ్, ఓయూలో రాహుల్కు సత్కారం
హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిందుకు గాను రాహుల్ గాంధీని సన్మానించాలని విద్యార్థి సంఘం ఆహ్వానం మేరకు ఉస్మానియా యూనివర్సిటీకు వచ్చి ఒక రాత్రంతా అక్కడే గడుపుతారని తెలుస్తోంది.
రైతు సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో మెదక్ జిల్లాలో మే రెండో వారంలో తెలంగాణలో రైతు భరోసా యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో వారిలో కొంత మంది కుటుంబాలనైనా ఓదార్చాలని రాహుల్ గాంధీ ఈ పాదయాత్రను తలపెట్టారు.
ఈ పాదయాత్రలో అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంతోపాటు రైతులకు మనోస్థైర్యం కల్పించనున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ రైతులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.
మోడీపై వీహెచ్ విసుర్లు
కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ రైతులను పరామర్శిస్తుంటే ప్రధాని మోడీ మాత్రం విదేశాల టూర్లంటూ కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. త్వరలో మెదక్ జిల్లాలో నిర్వహించనున్న రాహుల్ సందేశ్యాత్రలో వీహెచ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాయమాటలతో కాలం గడుపుతున్నారని చెప్పారు. పాత హామీలు నెరవేర్చకుండానే కేసీఆర్ కొత్త హామీలిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతామని వీహెచ్ అన్నారు.
ఇక నాగార్జున సాగర్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులపై ఆయన స్పందిస్తూ 1979లోనే కాంగ్రెస్ అలాంటివి నిర్వహించిందని, కాంగ్రెస్ను చూసి తెలంగాణ రాష్ట్ర సమితి కాపీ కొడుతుందని అన్నారు.