ఎట్టకేలకు లఖింపూర్ ఖేరికి రాహుల్, ప్రియాంక: బాధితులను గుండెలకు హత్తుకుని ఓదార్పు
లక్నో: కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ చేరుకున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను, జర్నలిస్టుల కుటుంబాలను బుధవారం రాత్రి పరామర్శించారు.
ప్రియాంకను తీసుకుని లఖింపూర్ ఖేరీకి రాహుల్..
కాగా, ఐదుగురు కాంగ్రెస్ నేతలకు మాత్రమే లఖీంపూర్ వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. సీతాపూర్లో తన సోదరి ప్రియాంకాగాంధీని తోడుగా తీసుకొని లఖీంపూర్కు చేరుకున్నారు రాహుల్. వీళ్లిద్దరితో పాటు పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ ఛన్నీ, చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బగేల్ , కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా లఖీంపూర్ ఖేరీ వెళ్లారు. వీరు ఐదుగురు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలను లఖీంపూర్ ఖేరికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
గుండెలకు హత్తుకుని ఓదార్చిన రాహుల్, ప్రియాంక
ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించడంతో రాహుల్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు.ప్రియాంకను సీతాపూర్ నిర్బంధం నుంచి విడుదల చేశారు. దాదాపు 52 గంటల తరువాత ప్రియాంక విడుదలయ్యారు. కాన్వాయ్లో రాహుల్తో పాటు ప్రియాంక , పంజాబ్ సీఎం చన్నీ , చత్తీస్గఢ్ సీఎం బగేల్కు మాత్రమే అనుమతి ఇచ్చారు. కార్యకర్తలను వెనక్కి పంపించారు పోలీసులు.మొదట 19 ఏళ్ల లవ్ ప్రీత్ సింగ్ కుటుంబసభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు రాహుల్, ప్రియాంక. ఆ తర్వాత మిగితా బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించారు. వారిని గుండెలకు హత్తుకుని ఓదార్చారు. అంతకుముందు లక్నో ఎయిర్పోర్ట్లో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సెక్యూరిటీ అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు రాహుల్. పోలీసుల తీరుపై మండిపడ్డారు. తొలుత సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారని , తర్వాత ఎస్కార్ట్తో వెళ్లాలని మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు రాహుల్ .. ఎట్టి పరిస్థితుల్లో కూడా లఖీంపూర్కు వెళ్తానని , బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని రాహుల్ స్పష్టం చేశారు.
Recommended Video
బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎంలు
కాగా, రైతు కుటుంబాలకు పంజాబ్ సీఎం చన్నీ , చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ బగేల్ 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించారు. అంతకుముందు చనిపోయిన రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం కూడా రూ. 45 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. కాగా, లఖీంపూర్ హింసాకాండలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రంమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేసే ప్రసక్తే లేదని బీజేపీ వర్గాలంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని, రైతులపై దూసుకెళ్లిన కాన్వాయ్లో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా లేడని కేంద్రం కూడా ధృవీకరించినట్టు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో జరిగిన సమావేశంలో అజయ్ మిశ్రా ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఇది ఇలావుంటే,ఎనిమిది రోజుల్లోగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయాలని రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్ టికాయత్ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రైతు సంఘాలు ఉద్యమిస్తాయని హెచ్చరించారు. కాగా, లఖీంపూర్ ఘటన సున్నిత అంశమని, దీనిని అడ్డు పెట్టుకుని ఉత్తరప్రదేశ్లో వాతావరణాన్ని పాడు చేయాలని ప్రయత్నించొద్దని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హితవుపలికారు. లఖింపూర్కు కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాక సందర్భంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో బుధవారం సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, ఆచార్య ప్రమోదలను యూపీ పోలీసులు మొరాదాబాద్లోనే అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన నక్షత్ర సింగ్ కుటుంబసబ్యులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్లో పరామర్శించారు. కాగా, గురువారం ఎస్పీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రాలు గురువారం లఖింపూర్ ఖేరి ఘటన బాధితులను పరామర్శించనున్నారు.