Rahul Gandhi T Shirt : గడ్డకట్టే చలిలోనూ టీ షర్ట్ లోనే రాహుల్- రియాక్షన్ ఏంటో తెలుసా ?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతోంది. అసలే ఉత్తర భారత దేశంలో చలి గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీలో పరిస్ధితి మరీ దారుణం. అయినా భారత్ జోడో యాత్రలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాహుల్ కొనసాగుతున్నారు. ఆయనతో పాటు పోటీ పడుతూయాత్రలో పాల్గొనడం కాంగ్రెస్ నేతలకు సవాలుగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ చలిని తట్టుకునేందుకు కనీసం స్వెట్టర్ కూడా వేసుకోకుండానే టీషర్ట్ తోనే యాత్ర కొనసాగిస్తుండటం విశేషం.
ఢిల్లీలో రక్తం గడ్డ కట్టేలా ఉన్న చలిలో రాహుల్ గాంధీ టీ షర్ట్ తోనే భారత్ జోడో యాత్రలో పాల్గొంటుండటంపై కాంగ్రెస్ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలైతే రాహుల్ నే ఈ విషయం పలుమార్లు అడిగేస్తున్నారట. అలాగే మీడియా ప్రతినిధులు కూడా రాహుల్ ను ఈ టీ షర్ట్ రహస్యంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. రాహుల్ కనిపించినప్పుడల్లా ఇవాళ కూడా టీ షర్ట్ లోనేనా అంటూ అడుగుతున్నారు. దీనిపై స్పందించిన రాహుల్.. తాజాగా వారికి ఓ సమాధానం ఇచ్చారు. దీంతో వారు అవాక్కయ్యారు.

ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా టీ షర్ట్ లోనే కనిపించిన రాహుల్ ను మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై ప్రశ్నించారు. దీంతో స్పందించిన రాహుల్.. ఎంత వరకూ కుదిరితే అంతవరకూ టీ షర్ట్ లోనే కొనసాగుతానంటూ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చూద్దామంటూ సున్నితంగా చెప్పేశారు. దీంతో రాహుల్ ఈ ఎముకలు కొరికే చలిలో ఎప్పటివరకూ అలా కొనసాగుతారో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. రాహుల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.













Click it and Unblock the Notifications