రాహుల్ మ్యూనిచ్ మీదుగా గ్రీస్!: సీనియర్లపై అసంతృప్తి, రాజకీయాల్లోనే.
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ గైర్హాజరీ పైన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
రాహుల్ కొన్ని వారాలపాటు పార్టీ కార్యక్రమాలకు, పార్లమెంటుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అందుకే సోమవారం పార్లమెంటుకు హాజరుకాలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధ్రువీకరించారు. రాహుల్ సెలవుపై వెళ్లారని, కొన్ని వారాలపాటు సెలవివ్వాలని ప్రజలను కోరారు. దీంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాలతోపాటు ఏప్రిల్ ఆరంభంలో జరిగే కాంగ్రెస్ సమావేశాలకూ రాహుల్ దూరం కానున్నారు.
వాస్తవానికి ఏప్రిల్ సమావేశాల్లోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్కు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, లోకసభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో ఒక్కసీటూ దక్కలేదు. దీంతో, విపక్షాలతోపాటు స్వపక్షంలోని కొందరు రాహుల్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఇందుకు అసలు కారణాలు ఇప్పటికీ తెలియడం లేదు. సమకాలీన అంశాలు, పార్టీ భవిష్యత్తుపై స్పందించడానికి రాహుల్కు కొంత సమయం కావాలని సోనియా వ్యాఖ్యానించారు. ఇక సోనియా చుట్టూ చాలామంది లాబీయింగ్ చేస్తున్నారంటూ రాహుల్ అసంతృప్తితో ఉన్నారని, పార్టీ ప్రధాన కార్యదర్శులను, పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను తొలగించాలని భావిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ కథనం ప్రసారం చేసింది.
ఇటీవలి ఆర్డినెన్సులను చట్టాలుగా మార్చడం, ఇతర చట్టాల సవరణకు ప్రభుత్వం యత్నిస్తుండడంతో పార్లమెంటులో మూకుమ్మడిగా విరుచుకుపడాలని విపక్షాలు చూస్తున్నాయి.
కాగా, పార్టీలోని కొందరు సీనియర్ నేతలతో వచ్చిన విభేదాలే రాహుల్ విరామానికి కారణమని అంటున్నారు. సోనియా చుట్టూ ఉన్న లాబీల పట్ల రాహుల్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. యువనేతలను తెరపైకి తీసుకు రావాలని భావిస్తున్నారంటున్నారు. అయితే, రాహుల్ రాజకీయాల నుండి విశ్రమించడం లేదని చెప్పారు.
ఇప్పటికే అడ్రస్ గల్లంతైంది: బీజేపీ
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని రాహుల్ను రాజీవ్ ప్రతాప్రూడీ ఎద్దేవాచేశారు. ప్రజలు ఇప్పటికే వారికి అడ్రస్ లేకుండా చేశారని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇన్నాళ్లూ ఆయన లీవులోనే ఉన్నారని ప్రజలు భావిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. ప్రజలు కాంగ్రెస్ను కచ్చితంగా సెలవులోకి పంపిస్తారని మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.