రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ, సోనియాపై ఉమా పోటీ?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై వచ్చే లోకసభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ మేరకు సోనియా గాంధీపై బిజెపి ఫైర్ బ్రాండ్ ఉమా భారతిని పోటీకి దించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. రాయ్బరేలిలో సోనియాకు ఉమా భారతి గట్టి పోటీ ఇవ్వగలరని బిజెపి నాయకత్వం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.
సోనియా గాంధీపై పోటీకి ఉమా భారతిని బరిలో ఉంచాలని యోగా గురువు బాబా రాందేవ్ బిజెపి నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. బాబా రాందేవ్ తనకు సోదరుడి లాంటివారని ఉమా భారతి ఇటీవల అన్నారు. ఆయన సూచనలు పాటిస్తానని చెప్పారు.
కాగా, ఉమాభారతికి ఝాన్సీ నుంచి లోకసభ స్థానాన్ని ఇప్పటికే బిజెపి ప్రకటించింది. మరో స్థానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించే అవకాశం ఉందని సమాచారం. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమా భారతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దిగ్విజయ్ సింగ్ను ఓటించారు.
అదే విధంగా రాహుల్ గాంధీపై కూడా మహిళా అభ్యర్థినే బరిలోకి దించాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ లోకసభ నియోజక వర్గం నుంచి బిజెపి తరపున స్మృతి ఇరానీని పోటీ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. తర్వలోనే ఈ నిర్ణయాలపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.