వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు గ్రేట్ న్యూస్
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ వినిపించింది. టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా? లేదా? అని కంగారు పడాల్సిన అవసరం ఉండదు. టికెట్ కన్ఫర్మేషన్ గురించి 24 గంటలు ముందుగానే ప్రయాణికులకు సమాచారం ఇచ్చే విధానానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది.
నాలుగు గంటల ముందు మాత్రమే..
ప్రస్తుతం- రైలు బయలుదేరి వెళ్లడానికి నాలుగు గంటల ముందు మాత్రమే ఛార్ట్ ప్రిపేర్ అవుతోందనే విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారం కూడా అప్పుడే ప్రయాణికులకు టెక్స్ట్ మెసేజీ లేదా ఇమెయిల్ రూపంలో అందుతోంది. ఈ విధానానికి తెర దించనుంది రైల్వే శాఖ.

24 గంటలు ముందుగా..
ఇకపై రైలు బయలుదేరి వెళ్లే సమయానికి 24 గంటలు ముందుగా చార్ట్ ప్రిపేర్ చేయనుంది. దీనికి సంబంధించిన సమాచారం కూడా అప్పుడే అందజేయాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ సరికొత్త విధానాన్ని ప్రారంభించింది. దీనిపై రాజస్థాన్ బికనేర్ డివిజన్ లో ట్రయల్ రన్ చేపట్టింది.
దశలవారీగా దేశవ్యాప్తంగా..
బికనేర్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లల్లో కూడా రైలు బయలు దేరడానికి 24 గంటల ముందు ఛార్టులను ప్రిపేర్ చేస్తోన్నామని, రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) దిలీప్ కుమార్ తెలిపారు. ఇది విజయవంతమైతే దశలవారీగా దేశవ్యాప్తంగా అన్ని జోన్లల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
గందరగోళాన్ని నివారించేలా..
ఈ కొత్త పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ప్రయాణికులు తమ టికెట్ స్థితిగతుల గురించి 24 గంటలు ముందుగానే తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయాలను ప్లాన్ చేసుకోవడానికి వీలు కలిగినట్టవుతుంది. రైల్వే కార్యకలాపాలను ఆధునీకరించడం, సేవలను క్రమబద్ధీకరించడం,స్టేషన్లలో చివరి నిమిషంలో రద్దీ, గందరగోళాన్ని నివారించడానికి ఈ కొత్త ప్రాజెక్ట్ దోహదపడుతుందని దిలీప్ కుమార్ చెప్పారు.
తగినంత సమయం..
రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు ప్యాసింజర్ చార్ట్ను విడుదల చేయడం ద్వారా, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణీకులకు ప్రత్యామ్నాయాలను వెదుక్కోగలరని, టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి తగినంత సమయం లభించినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications