మే తరువాతే పెళ్లిళ్లు: 11 మందికి మించితే..కఠిన చర్యలు: అక్కడ కంప్లీట్ లాక్డౌన్
జైపూర్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోందే తప్ప.. పూర్తిగా అదుపులోకి రావట్లేదు. మరోసారి మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల్లోనూ అదే ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 3,449 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. గురువారం నాటి బులెటిన్ ప్రకారం దేశంలో 4,12,262 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,980 మంది మరణించారు. రోజువారీ మరణాల్లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం.
ఒక్కో రాష్ట్రంలో లాక్డౌన్..
ఈ పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ విధించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కరోనా కట్టడికి ఇదివరకట్లా లాక్డౌన్ విధించడం ఒక్కటే మార్గమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మళ్లీ మొదటికొస్తాయనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమౌతోంది. లాక్డౌన్పై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలను తీసుకోవాలనే సందేశాన్ని ఇచ్చింది కేంద్రం. దీనితో ఒక్కో స్టేట్.. లాక్డౌన్లోకి జారిపోతున్నాయి. సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి.
రాజస్థాన్ కంప్లీట్ షట్డౌన్..
తాజాగా- రాజస్థాన్ కూడా కంప్లీట్ లాక్డౌన్ను ప్రకటించింది. ఇప్పటిదాకా వీకెండ్లో మాత్రమే లాక్డౌన్ను అమలు చేస్తూ వచ్చిన రాజస్థాన్ సర్కార్.. దాన్ని మరింత విస్తరింపజేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి అంటే.. సోమవారం తెల్లవారు జామున 5 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తుంది. వచ్చేనెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, హర్యానా, బిహార్, కేరళ.. సంపూర్ణ లాక్డౌన్లోకి వెళ్లాయి. ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా పాక్షికంగా దీన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రాత్రివేళ కర్ఫ్యూ విధించాయి. ఏపీలో బుధవారం నుంచి పాక్షిక లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
మే తరువాతే పెళ్లిళ్లు..
రాజస్థాన్లో కొత్తగా 17,532 రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 161 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 7,02 ,568కి చేరుకున్నాయి. వాటిని నియంత్రించడానికి పూర్తిస్థాయి లాక్డౌన్ను విధించినట్లు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తెలిపింది. మే తరువాతే పెళ్లిళ్లను జరుపుకోవాలని ఆదేశించింది. తప్పనిసరిగా వివాహాన్ని జరిపించాలనుకుంటే.. ఇంట్లో మాత్రమే ఆ వేడుకను నిర్వహించుకోవాల్సి ఉంటుందని, వధూవరులు, వారి తరఫు కుటుంబ సభ్యులతో కలుపుకొని 11 మందికి మించకూడదని స్పష్టం చేసింది రాజస్థాన్ ప్రభుత్వం.
గ్రామాల మధ్య రాకపోకలు సైతం..
గ్రామాల మధ్య రాకపోకలను సైతం నిషేధించింది. కాలినడకన కూడా వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు యధాతథంగా కొనసాగించినప్పటికీ.. తమ రాష్ట్ర పరిధిలో కొన్ని ఆంక్షలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను కూడా రద్దు చేసింది. తీవ్రత అధికంగా లేని ప్రాంతాల్లో ఈ పనులను కోవిడ్ ప్రొటోకాల్స మధ్య కొనసాగిస్తామని స్పష్టం చేసింది.